English | Telugu

ఆ రెండు ఉత్తరాంధ్ర జిల్లాల్లో లాక్ డౌన్ ఎత్తేస్తారా ? అధికారుల సంకేతాలు...

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కేసులు నమోదువుతున్నా ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు కాని ఉత్తరాంధ్ర జిల్లాల విషయంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో రెడ్ జోన్లు లేకపోవడం, ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం వంటి కారణాలతో లాక్ డౌన్ ఎత్తేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల పరిస్ధితిపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం ఎప్పటికప్పుడు అధికారులతో వివరాలు తెప్పించుకుంటోంది. వీటి ఆధారంగా ఉత్తరాంధ్రలో లాక్ డౌన్ ను సడలిస్తేనే మేలనే భావన అధికారుల్లో వ్యక్తమవుతోంది.

లాక్ డౌన్ ఎత్తేసినా షాపింగ్ మాల్క్, గుళ్లు, విద్యాసంస్ధలు, మార్కెట్లు వంటి ప్రాంతాల్లో మాత్రం ఆంక్షలు కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి ఉత్తరాంధ్రకూ ఇవే నిబంధనలు వర్తింపజేయనున్నారు. వీటిని మినహాయించి మిగిలిన లాక్ డౌన్ నిబంధనలను సడలిచేందుకే ప్రభుత్వం మొగ్గు చూపనున్నట్లు తెలుస్తోంది. ఎల్లుండి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో లాక్ డౌన్ ఎత్తేసేందుకు కసరత్తు చేస్తున్న అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మొబైల్ టెస్టింగ్ సెంటర్లు, ప్రత్యేక కియోస్క్ లను ఏర్పాటు చేస్తున్నారు. అప్పటికప్పుడు పరిస్ధితులు తారుమారైతే ఈ మొబైల్ కియోస్క్ ల ద్వారా పరీక్షలు నిర్వహిచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో విశాఖపట్నం జిల్లా నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు రాకపోకలను కూడా నియంత్రించే అవకాశముంది.