English | Telugu

6,000 కోట్ల ఆదాయం కోల్పోయిన ఏపీ సర్కార్

కరోనా వైరస్ ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ ఆదాయానికి భారీగా గండి కొట్టింది. ఆబ్కారీ శాఖలో రూ.1500 కోట్లు, వాణిజ్యశాఖలో రూ.4500 కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది. అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అబ్కారీ వాణిజ్య పన్నుల శాఖామాత్యులు కె.నారాయణస్వామి ఈ విషయాలను వెల్లడించారు. ఆదాయం కోల్పోయినప్పటికీ, తమ ప్రధమ ప్రాధాన్యం ప్రజారోగ్యమేనని ఆయన స్పష్టం చేశారు.

లాక్ డౌన్ సమయంలో చాలా చోట్ల బార్లకు సంబంధించిన స్టాక్ ను బయట అధికరేట్లకు అమ్ముతున్నారన్న వార్తల నేపథ్యంలో అన్ని బార్లలో, షాపుల్లో స్టాక్ ను తనిఖీ విస్తృతం చేయాలని దిశానిర్ధేశం చేశారు. ఎక్కడైనా అవకతవకలు జరిగినట్లు తన దృష్టికి వస్తే చర్యలకు ఆదేశిస్తామన్నారు. నాటుసారా, ఎన్డీపీఎల్ పై ప్రత్యేక దాడులు నిర్వహించే దిశగా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచాలని ఆదేశించారు.

లాక్ డౌన్ సమయంలో 2791 కేసులు, 2849 మంది వ్యక్తులను అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు. సుమారు 22 వేల లీటర్ల ఐడీని సీజ్ చేశామని వెల్లడించారు. 2100 కేసులు ఐఎమ్ఎల్, 1500 కేసులు బీర్లు, 1457 కేసులు ఎన్డీపీఎల్ సీజ్ చేశామన్నారు. అదే విధంగా 665 వెహికిల్స్ ను సీజ్ చేశామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ షాపుల్లో సీసీ కెమెరాలు పెట్టాలని సూచించామన్నారు. ఐడీని నియంత్రించేందుకు పీడీ కేసులు కూడా పెట్టమని చెప్పామన్నారు. బార్లలో అవకతవకలు జరిగితే బార్ లైసెన్స్ రద్దు చేయడానికైనా వెనకాడబోమన్నారు. అదే విధంగా బైండ్ ఓవర్ అమౌంట్ ను పెంచామని చెప్పామన్నారు. బార్లలో దొంగతనంగా మద్యం అమ్ముతున్నారని వచ్చిన కథనాల్లో వాస్తవం ఉందని, తమ దృష్టికి రాగానే వెంటనే వాటిపై చర్యలు తీసుకున్నామన్నారు. ఎక్సైజ్, రెవెన్యూ శాఖలు కలిసి విచారణ చేపడుతున్నామన్నారు. ఇప్పటికే ఒక సీఐని, ముగ్గురు ఎస్సైలను, ఒక కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశామని వివరించారు. శాఖాపరమైన విచారణ చేసిన అనంతరం అవకతవకలకు పాల్పడినట్లు తమ దృష్టికి వస్తే ఉద్యోగాలు తొలగించడానికైనా వెనకాడబోమని హెచ్చరించారు.