English | Telugu

విపత్తు సమయంలో ఏపీ సీఎం ముందుచూపు

* బీమాలో ప్రభుత్వం వాటా వెంటనే చెల్లింపు
* రూ. 400 కోట్ల బీమా చెల్లింపునకు జగన్ నిర్ణయం
* గత ఏడాది నవంబర్‌ నుంచి క్లెయిమ్‌లను పరిష్కరించని ఎల్‌ఐసీ
* ఇప్పటికే పలుమార్లు ప్రధాన మంత్రి సీఎం లేఖలు
* ప్రధానమంత్రి నుంచి ఎల్‌ఐసీకి లేఖ
* అయినా పరిష్కారానికి నోచుకోని బీమా క్లెయిములు
* దీనికోసం పోరాటం కొనసాగిస్తూనే ప్రభుత్వ వాటాను నేరుగా బీమాదారులకు చెల్లించాలని సీఎం నిర్ణయం
* రేపటి నుంచి (శనివారం) చెల్లింపులకు నిర్ణయం
* ఎల్‌ఐసీ ఇవ్వకుంటే.. మిగిలిన మొత్తాన్ని కూడా రాష్ట్రఖజానానుంచే ఇవ్వాలని సీఎం ఆదేశం

విపత్తు సమయంలో ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. బీమా క్లెయిములు ఎల్‌ఐసీ మంజూరుచేయకున్నా ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన వాటాను వెంటనే మంజూరు చేయాలని ముఖ్యమంత్రివైయస్‌.జగన్‌ నిర్ణయించారు. గడచిన నవంబర్‌ నుంచి పరిష్కారం కాని క్లెయిముల కుటుంబాలకు వెంటనే చెల్లింపులు చేయాలని ఆదేశించారు. ఈమేరకు శనివారం ( రేపటి ) నుంచి డబ్బులను ఆయా కుటుంబాలకు అందించడానికి అధికారులు ప్రయత్నాలు ముమ్మరంచేశారు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ లాంటి సదుపాయాల్లేని వారు, కూలిపనులు చేసుకునేవారు, చిన్న జీతాలతో నెట్టుకు వస్తున్న వారు, చిన్నచిన్న పనులు చేసుకునేవారు సహజమరణం చెందినా, లేదా ప్రమాదవశాత్తూ మరణించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎల్‌ఐసీ కలిసి బీమాను అందించేవి. వయస్సుల వారీగా, సహజ మరణానికి ఒక తరహా బీమా, ప్రమాదవశాత్తూ మరణిస్తే మరో రకమైన బీమాను చెల్లించేవి. అయితే గడచిన నవంబర్‌ నుంచి ఈ క్లెయిములు పరిష్కారం నిలిచిపోయింది. ఈ అంశంపై వెంటనే దృష్టిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి 4 సార్లు లేఖ రాశారు. ప్రధాని మోదీకూడా ఎల్‌ఐసీకి లేఖరాశారు. అయినా సరే ఇప్పటివరకూ క్లెయిమ్‌లను మంజూరుచేయలేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. సహజ మరణాలవల్లో, ప్రమాదాల వల్లో పెద్ద దిక్కును కోల్పోయిన ఆయా కుటుంబాలకు అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. క్లెయిమ్‌ల మంజూరు కోసం పోరాటం చేస్తూనే, దానితో ఆగిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా సుమారు రూ. 400 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు.

ఒకవేళ బీమా సంస్థ తాను ఇవ్వాల్సిన దాన్ని చెల్లించకున్నా.., బీమా సంస్థ ఇవ్వాల్సిన మొత్తాన్నికూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించాలని సీఎం నిర్ణయించారు. కరోనా లాంటి విపత్తు నెలకొన్న పరిస్థితుల్లో, ప్రభుత్వం ఆదాయం పడిపోయిన సమయంలోకూడా ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.