విశాఖలో ఇటీవల ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి స్టైరిన్ గ్యాస్ లీక్ అయి 12 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నుంచి పూర్తిగా కోలుకోకముందే విశాఖలో మళ్లీ కలకలం రేగింది. హెచ్పీసీఎల్ కంపెనీ నుంచి ఒక్కసారిగా దట్టమైన తెల్లని పొగలు అలుముకున్నాయి. పొగ రావడంతో స్థానికులు భయాందోళనకు గురై.. ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే కాసేపటికే పొగ తగ్గిపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. హెచ్పీసీఎల్ రిఫైనరీలోని ఎస్హెచ్యూని తెరిచే సమయంలో ఈ ఘటన జరిగింది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగినట్టు గుర్తించామని, సమస్యను వెంటనే చక్కదిద్దామని, ఎలాంటి ప్రమాదం లేదని హెచ్పీసీఎల్ వర్గాలు అంటున్నాయి.