విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వ విచారణ తూతూమంత్రంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. మీడియాతో శుక్రవారం మాట్లాడిన ఆయన ఈ ఘటన దురదృష్టకరమన్నారు. సహాయ కార్యక్రమాల్లో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారని తెలిపారు. విశాఖ వెళ్లేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు. ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా స్టైరిన్ ప్రమాదం జరగలేదని చెప్పారు. మానవ తప్పిదమా? లేక టెక్నికల్ సమస్యా? తేలాల్సి ఉందన్నారు. జనసాంద్రత మధ్య ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఉండడం సరికాదన్న ఆయన.. బాధితులు ప్రస్తుతానికి కోలుకున్నా మళ్లీ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. విశాఖ ఘటనను హైకోర్టు, హెచ్ఆర్సీ సుమోటోగా తీసుకున్నాయని, కేంద్రం కూడా హైపవర్ కమిటీని నియమించిందన్నారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై చిన్న చిన్న కేసులు నమోదు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.