Facebook Twitter
చైత‌న్య‌పు ఖ‌డ్గాన్ని

తెలుగువ‌న్‌-అక్ష‌ర‌యాన్ ఉగాది క‌విత‌ల పోటీలో ద్వితీయ బ‌హుమ‌తి రూ. 2,116 పొందిన క‌విత‌ 
"చైత‌న్య‌పు ఖ‌డ్గాన్ని"


నిన్నరాత్రి  నిషిద్ధాక్షరాలు
రాలిపడ్డాయి నిశ్శబ్దపు పుటలనుండి
నాలో నిగూఢమైన చైతన్యపు నేత్రాలు
అస్కరుని కిరణాల్లా
విస్తరించాయి విశ్వక్షేత్రంపై

నిజానికి నేనిప్పుడు 
నిరంతరాన్వేషిని
దూసుకుపోతున్నాను 
నిశిదుప్పటి దులిపేసి
నిజ ఉషస్సు కేసి
నేనిప్పుడు వేయాల్సింది
లక్ష్యపు క్షేత్రంలో లక్షలనాట్లు
నన్నో విజయగీతంగా 
మలచుకోవాలి...
ఎన్నో ఓటమి పర్వాలకు
పర్యవసానంగా..
గెలుపు గుమ్మం చేరుకోవాలి

నేనిప్పుడు నైరాశ్యపు
నిబిడాంధకారాన్ని చీల్చిన
చైతన్యపు ఖడ్గాన్ని
వేకువతట్టుకు వెలుగును పూసిన
తూరుపు సింధూరాన్ని
నిట్టూర్పులు, నీరుగారడాలు
నిన్నటి గతించిన క్షణానివి
వెనుకంజ వేయడాలు
వెక్కి, వెక్కి ఏడ్వడాలు
కాలంచెల్లిన వాక్యాలు
నే నడిచే గమనంలో నిరాశకు
తావివ్వను,నీరసాన్ని రానివ్వను

కన్నీటి కారకాలు సవాలక్ష  
కర్తవ్యప్రేరకాలను 
అన్వేషించడమేగా
మనిషిగా మన సార్ధకత
ఉప్పెనలోనే ఊపిరోసుకొంటాయి
ఉజ్వలమైన ఉపాయాలు
దిగులుమంత్రం ఉచ్ఛరిస్తూ 
నీరసిస్తే ఉద్ధరించే నాధుడెవ్వడు
వెతలే తాకని వేదన సోకని
బతుకుంటుందా ఇలాతలంలో
కంటకాలు అధిగమించక 
కామితాలు నెరవేరేనా
కణకణమండే నిప్పున కాలక
కనకము నిగ్గు తేలేనా

రహదారిని త్రవ్వుతున్నాను
రాలుతున్న ఆశల వెంబడి
నా ఆలోచనాస్త్రాలు
రవికాంతి కిరణాలై 
ఆశయానికి దారిచూపిస్తాయి.
నేనిప్పుడు నిలువెత్తు ఆత్మవిశ్వాసాన్ని
నేనిప్పుడు విజయపతాకాన్ని
విశ్వ వినువీధులవెంట 
విజయోత్సాహానికి ప్రతీకగా
విరాజిల్లుతున్నాను.

చైతన్యపుఖడ్గాన్ని అనే నా ఈ కవిత
నా సొంత రచనయని ఈపోటీకోసం మాత్రమే
రాసినదని హామీ ఇస్తున్నాను.

 

ర‌చ‌న‌: సాలిపల్లి మంగామణి (శ్రీమణి)