వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిలు రద్దు?
Publish Date:Apr 22, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఈ హత్య కేసులో పీకల్లోతు కష్టాల్లో ఉన్న అనంతబాబు.. తాజాగా సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు. సాక్షులను భయపెట్టి, డబ్బు ఆశ చూపి తన వైపు తిప్పుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడమే కాకుండా.. ఇప్పుడు ఆ ప్రయత్నం ఆయన బెయిల్ రద్దుకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. గతంలో తన వద్ద డ్రైవర్గా పనిచేసిన సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్లు అనంతబాబుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ప్రస్తుతం ఆయన బెయిల్పై ఉన్నారు. అయితే ఈ నెల 24, 25 తేదీల్లో కోర్టులో నిందితులపై నేరాభియోగాల నమోదు ప్రక్రియ జరగనుంది. ఈ తరుణంలో సాక్షులు ఇచ్చే వాంగ్మూలం కేసు గమనాన్ని మార్చే అవకాశం ఉండటంతో.. వారిని ప్రలోభపెట్టేందుకు అనంతబాబు ప్రయత్నించారు. నలుగురు కీలక సాక్షులను ఒక అపార్ట్మెంట్లో బంధించి, ఒక్కొక్కరికి లక్షలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. సాక్షులను నిర్బంధించిన అనంతబాబు, వారికి ముందస్తుగా లక్ష నగదు అందజేసినట్లు పోలీసులు గుర్తించారు. కోర్టులో తనకు అనుకూలంగా సాక్ష్యం చెబితే మరో 2 లక్షలు ఇస్తాననీ, లేకుంటే చంపేస్తానీని వారిని బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అత్యంత రహస్యంగా సాగుతున్న ఈ వ్యవహారంపై పోలీసులకు ముందస్తు సమాచారం అందడంతో వారు ఆ అపార్ట్మెంట్పై దాడి చేశారు. పోలీసుల రాకను గమనించిన అనంతబాబు తన గన్మెన్లను, కారును అక్కడే వదిలేసి బైక్పై పరారయ్యారు. పోలీసుల ప్రాథమిక విచారణలో సాక్షులపై ఒత్తిడి తెచ్చిన విషయం వాస్తవమని తేలింది. ఈ మేరకు అనంతబాబుతో పాటు ఆయన అనుచరుడు, వైసీపీ బీసీ సెల్ నేత మాగంటి రాంబాబుపై కొత్తగా కేసు నమోదు చేశారు. రాంబాబును ఇప్పటికే అదుపులోకి తీసుకోగా.. పరారీలో ఉన్న అనంతబాబు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గతంలోనే సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తే బెయిల్ రద్దు చేస్తామని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉండటంతో, ఇప్పుడు అనంతబాబు బెయిలు రద్దు కావడం, మళ్ళీ జైలుకు వెళ్లడం ఖాయమని న్యాయ నిపుణులు అంటున్నారు. ఈ కేసులో అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గ పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమెను ఇప్పటికే సుదీర్ఘంగా విచారించిన పోలీసులు, తాజా పరిణామాల నేపథ్యంలో ఆమె స్టేట్మెంట్ను కూడా పరిశీలిస్తున్నారు. మరోవైపు బాధితుడు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని, నిందితుడు సాక్షులను బెదిరిస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అనంతబాబు ఎక్కడ ఉన్నారనే దానిపై పోలీసులు టెక్నికల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. సాక్షుల నిర్బంధం, లంచం ఆశ చూపడం వంటి బలమైన ఆధారాలు దొరకడంతో.. ఈసారి ఆయనకు కోర్టు నుండి ఉపశమనం లభించడం కష్టమని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/ycp-mlc-anantha-babu-bail-cancell-36-217967.html





