15 ఏళ్ల వయసులో అంత కోపమా? లంక ప్లేయర్ను నెట్టేసిన వైభవ్ సూర్యవంశీ!
Publish Date:Jun 16, 2026
Advertisement
భారత క్రికెట్లో సరికొత్త బ్యాటింగ్ సంచలనంగా దూసుకొస్తున్న 15 ఏళ్ల యువ కిరణం వైభవ్ సూర్యవంశీ కెరీర్ కీలక మలుపులో ఉన్న తరుణంలో ఒక అనూహ్య వివాదంలో చిక్కుకున్నాడు. ఈ నెలాఖరులో ఐర్లాండ్తో జరగబోయే టీ20 సిరీస్ ద్వారా సీనియర్ టీమిండియా జట్టులోకి అరంగేట్రం చేయడానికి ముందే, మానసికంగా మరింత దృఢంగా మారాలనే ఉద్దేశంతో వైభవ్ శ్రీలంక పర్యటనకు వెళ్లాడు. ఐపీఎల్ 2026 సీజన్లో రికార్డు స్థాయి ప్రదర్శనతో సెలక్టర్లను ఆకర్షించిన ఈ యువ ఆటగాడు ఏకంగా మూడు టీ20 సిరీస్లకు ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే, శ్రీలంక 'ఎ' జట్టుతో జరిగిన ట్రై-సిరీస్ మ్యాచ్లో భారత్ 'ఎ' జట్టు ఘోర పరాజయం చవిచూసిన తర్వాత, వైభవ్ లంక ఆటగాడితో నేరుగా భౌతిక దాడికి దిగడం క్రికెట్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మ్యాచ్ ఉత్కంఠభరితమైన సూపర్ ఓవర్కు దారితీసింది. సూపర్ ఓవర్లో గెలవడానికి 17 పరుగులు కావాల్సిన తరుణంలో, లంక బౌలర్ కగుథా మథులన్ అద్భుతమైన బౌలింగ్ దాడిని ప్రదర్శించాడు. ఈ ఒత్తిడిలో భారత్ కేవలం 9 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ సూపర్ ఓవర్లో వైభవ్ సూర్యవంశీ తాను ఎదుర్కొన్న 3 బంతుల్లో ఒక ఫోర్తో సహా 6 పరుగులు చేసినప్పటికీ, జట్టును విజ తీరాలకు చేర్చలేకపోయాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే లంక ఆటగాళ్లు మైదానంలో సంబరాల్లో మునిగిపోగా, తీవ్ర నిరాశతో వైభవ్ మరియు అతని భాగస్వామి సూర్యాంశ్ షెడ్జ్ పెవిలియన్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో మథులన్తో సహా కొందరు లంక ఆటగాళ్లతో జరిగిన మాటల యుద్ధం కాస్తా శృతిమించి, తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఆగ్రహంతో ఊగిపోయిన 15 ఏళ్ల వైభవ్, ఒక శ్రీలంక ఆటగాడిని చేతులతో బలంగా నెట్టేయడం టీవీ విజువల్స్లో స్పష్టంగా కనిపించింది. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో, లంక సీనియర్ ప్లేయర్ నిరోషన్ డిక్వెల్లా సకాలంలో జోక్యం చేసుకుని వైభవ్ను పక్కకు లాగడంతో గొడవ పెద్దది కాకుండా ఆగింది. అయినప్పటికీ వైభవ్ తీవ్ర కోపంతో లంక ఆటగాళ్ల వైపు అసభ్యకరమైన సైగలు చేస్తూనే వెనుదిరిగాడు. ఓ మంచి ప్లేయర్కి కావాల్సింది కేవలం బ్యాటింగ్ నైపుణ్యాలు మాత్రమే కాదు, మైదానంలో క్రమశిక్షణ, సహనం కూడా ఎంతో ముఖ్యం అని సీనియర్లు, క్రికెట్ నిపుణులు వైభవ్ శైలిపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ మ్యాచ్లో వైభవ్ ఇలా సహనం కోల్పోవడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు లంక సూపర్ ఓవర్ ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అంపైర్ నో-బాల్ ఇవ్వడంపై భారత కెప్టెన్ తిలక్ వర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అప్పటికే ప్యాడ్లు కట్టుకుని సిద్ధంగా ఉన్న వైభవ్, డ్రెస్సింగ్ రూమ్ నుండి నేరుగా మైదానంలోకి దూసుకొచ్చి అంపైర్తో తీవ్ర వాదనకు దిగాడు. ఆ తర్వాత హెడ్ కోచ్ హృషికేష్ కనిట్కర్ స్వయంగా రంగంలోకి దిగి, అతడిని పక్కకు తీసుకురావాల్సి వచ్చింది. ఈ వివాదాల కారణంగా వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ఐసీసీ కఠిన క్రమశిక్షణా చర్యలను ఎదుర్కొనే ప్రమాదంలో పడ్డాడు. గతంలో 2024 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఇలాగే మైదానంలో దూకుడుగా ప్రవర్తించి, తోటి ఆటగాడిని ఢీకొట్టినందుకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానాతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ను ఐసీసీ విధించిన సంగతి తెలిసిందే. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్టికల్ 2.12 ప్రకారం.. అంతర్జాతీయ మ్యాచ్ల సమయంలో ఆటగాళ్లు, అంపైర్లు లేదా ఇతర సిబ్బందితో అనుచితంగా భౌతికంగా ఘర్షణ పడటం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రెఫరీ ప్రదీప్ జయప్రగాష్ ఈ యువ ఆటగాడికి కేవలం హెచ్చరికతో వదిలేస్తారా లేక అధికారికంగా భారీ జరిమానా విధిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. సీనియర్ టీమిండియా జట్టులోకి అడుగుపెడుతున్న వేళ ఇలాంటి వివాదాలు వైభవ్ భవిష్యత్తును దెబ్బతీయకూడదని అభిమానులు ఆశిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/vaibhav-sooryavanshi-faces-icc-action-sri-lanka-fight-36-223065.html





