ఆ ముగ్గురూ మారలేదు! జగన్ దారి వీడలేదు!
Publish Date:Sep 30, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఓ ముగ్గురు నాయకులు ఉన్నారు. వారు పేరుకే బీజేపీ కానీ పని చేసేది మాత్రం జగన్ కోసం. ఔను నిజమే ఈ ముగ్గురూ బీజేపీయులే. కారణాలేమైతేనేం.. 2004 నుంచి 2019 వరకూ వారి తీరును అన్ని విధాలుగా అభినందించి ప్రోత్సహించింది బీజేపీ హైకమాండ్. ఈ ముగ్గురి తీరు వల్లా అప్పట్లో బీజేపీలో విభేదాలు రచ్చకెక్కాయి. ఢిల్లీ దాకా పాకి పంచాయతీలు కూడా జరిగాయి. అయినా అధిష్ఠానం అండదండలూ, ప్రోత్సాహం, ఆశీర్వాదం ఉన్న ఆ ముగ్గురు నేతలపైనా అప్పట్లో ఈగ కూడా వాలలేదు. అయితే కాలం ఎల్ల వేళలా ఒకేలా ఉండదు కదా.. 2019 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బీజేపీ, తెలుగుదేశం మధ్య పొత్తు పొడిచింది. వైసీపీ విషయంలో బీజేపీ తీరు మారింది. అయినా ఈ ముగ్గురూ మాత్రం మారలేదు. ఆర్నెళ్లు సావాసం చేస్తేనే వారు వీరౌతారంటారు. అలాంటిది ఐదేళ్ల సావాసం మరి. మార్పు రాకుండా ఎలా ఉంటుంది. దీంతో ఆ ముగ్గురు బీజేపీ నేతలకూ హైకమాండ్ జగనే అన్నట్లుగా వారి తీరు మారిపోయింది. ఇప్పటికే మీకు అర్ధమైపోయి ఉంటుంది ఆ ముగ్గురూ ఎవరూ. వాళ్లు బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, విష్ణువర్దన్ రెడ్డి. ఔను ఆ ముగ్గురి గురించే ఇప్పుుడు మనం చెప్పుకుంటున్నది. తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో చాలా కాలం తెలుగుదేశం, బీజేపీల మధ్య పొత్తు ఉంది. తెలుగుదేశం రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ, బడ్జెట్ లో నిధుల కేటాయింపు వంటి అంశాలలో కేంద్రంలోని మోడీ సర్కార్ తో విభేదించి ఎన్డీయే నుంచి బయటకు వచ్చే వరకూ తెలుగుదేశం, బీజేపీలు మిత్రపక్షాలే. అయినా రాష్ట్రంలో మాత్రం బీజేపీ తెలుగుదేశం పార్టీకి ప్రత్యర్థి పార్టీగా.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే శత్రు పార్టీగా వ్యవహరించింది. తెలుగుదేశం ప్రభుత్వంలో ముగ్గురు బీజేపీ మంత్రులు ఉన్నా కూడా ఎందుకో అప్పట్లో బీజేపీ, తెలుగుదేశం మధ్య స్నేహ కుసుమాలు వికసించలేదు. ప్రభుత్వంలో ఉన్నాం అంటూ తెలుగుదేశం విధానాలు, నిర్ణయాలకు సానుకూలంగా స్పందించిన మంత్రులు పార్టీలో ఒంటరులయ్యారు. అది వేరే సంగతి. ఆ సమయంలో రాష్ట్ర బీజేపీలో ఈ ముగ్గురి ప్రభా వెలిగిపోయింది. అందుకు పార్టీ అగ్రనాయకత్వం ఆశీస్సులు, అండదండలే కారణమనడంలో సందేహం లేదు. అయితే గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల తరువాత మళ్లీ జగన్ పక్షాన గట్టిగా నోరెత్తేందుకు పార్టీ అధిష్ఠానం తమనే ఎంచుకుంటుందని వీరు భావించారు. కానీ ఎన్నికల తరువాత పరిస్థితి పూర్తిగా తల్లకిందులైంది. కేంద్రంలో మోడీ సర్కార్ మనుగడకు చంద్రబాబు మద్దతుపైనే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో జీవీఎల్, సోము, విష్ణువర్ధన్ రెడ్డిలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. నామినేటెడ్ పదవుల విషయంలో కూడా వారిని పరిగణనలోనికి తీసుకునే అవకాశాలు కూడా మృగ్యమయ్యాయి. అయినా ఈ ముగ్గురూ ఇంకా జగన్ పాటే పాడుతున్నారు. లేకపోతే.. దేశాన్ని కుదిపేస్తున్న లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం విషయంలో ఈ ముగ్గురూ కనీసం నోరు మెదపడం లేదు. కేంద్ర మంత్రుల నుంచి స్థానిక బీజేపీ నేతల వరకూ అందరూ లడ్డూ వివాదం విషయంలో జగన్ పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తుంటూ ఈ ముగ్గురూ మాత్రం నోరు కుట్టేసుకుని, కట్టేసుకుని కూర్చున్నారు. ఎందుకంటే ఇప్పటికీ వీరు తమ బాస్ జగనే అనుకుంటున్నట్లుగా ఉన్నారు.
http://www.teluguone.com/news/content/thouse-three-leaders-did-not-change-39-185908.html





