విమాన ప్రయాణం గాలిలో దీపమేనా.. వరుస సంఘటనలతో జనం బెంబేలు
Publish Date:Jun 16, 2025

Advertisement
అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాద విషాదచ్ఛాయలు ఇంకా మరువక ముందే.. విమానాలలో వరుసగా తలెత్తుతున్న లోపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు విమాన ప్రయాణమంటేనే బెంబేలెత్తేలా చేస్తున్నాయి. తాజాగా చెన్నైకు బయలు దేరిర బ్రిటిష్ ఎయిర్ వేస్ కు చెందిన బోయింగ్ 787 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కు మళ్లించి లండన్ లోని హీత్రూ మిమానాశ్రయంలో దించారు.దీంతో పెను ప్రమాదం తప్పింది. సరిగ్గా అహ్మదాబాద్ విమానానికి జరిగినట్లే ఈ బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానం కూడా టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. పైలట్ ఫ్లాప్ అడ్జస్ట్ మెంట్ లోపం అని పేర్కొన్నారు. విమానం 9000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా ఈ లోపాన్ని కనుగొన్న పైలట్ వెంటనే విమానాన్ని వెనక్కు మళ్లించి హిత్రూ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.
అలాగే ఉత్తర ప్రదేశ్ నుంచి కోల్ కతా వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో కూడా సాంకేతిక లోపం తలెత్తింది. పైలట్ సకాలంలో ఆ లోపాన్ని గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. ఘజియాబాద్ లోని హిండన్ విమానాశ్నయం నుంచి టేకాఫ్ చేసే సమయంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ విమానాన్ని రన్ వే పేనే నలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. దీనిపై స్పందించిన ఎయిర్ ఇండియా సాంకేతిక సమస్య కారణంగా విమానం ఆలస్యంగా నడిచినట్లు పేర్కొంటూ, ప్రయాణికులకు ఉచిత రీషెడ్యూలింగ్, టికెట్ రద్దు చేసుకుంటే.. పూర్తి డబ్బులు వాపస్ ఇస్తామని ప్రకటించింది.
ఇక ఆదివారం (జూన్ 15) అమెరికాలో ని బోస్టన్ లోగాన్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న జెటెబ్లూ విమానం రన్ వే నుంచి జారి పక్కకు దూసుకెళ్లింది. పైలట్ అప్రమత్తత కారణంగా ఘోర విప్తత్తు తప్పింది.
ఇక జర్మనీ నుంచి హైదరాబాద్ రావాల్సిన లుఫ్తాన్సా ఎల్హెచ్ 752 విమానం బయలుదేరిన కొద్ది సేపటికి యూటర్న్ తీసుకుని వెనక్కు మళ్లించి ఫ్రాక్ ఫర్డ్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. హైదరాబాద్ లో ల్యాండింగ్ కు అనుమతి లేకపోవడమే ఇందుకు కారణమని లుఫ్తాన్సా సంస్థ ప్రకటించింది. అయితే.. బాంబు బెదరింపు కారణంగానే విమానాన్ని వెనక్కు మళ్లించినట్లు తెలుస్తోంది. వరుస సంఘటనలతో విమానప్రయాణమంటేనే జనం బెంబేలెత్తుతున్నారు.
http://www.teluguone.com/news/content/techinical-lapse-in-british-airways-flight-39-200018.html












