తుని కేసు విచారణపై జీవో.. కుట్ర కోణంపై అనుమానాలు
Publish Date:Jun 4, 2025

Advertisement
తుని కేసు.. అప్పట్లో ఏపీలో ఓ సంచలనం. కాపు రిజర్వేషన్ల కోసం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేసిన దీక్ష తీవ్ర వివాదస్పదమైంది. 2016లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కాపు రిజర్వేషన్ల పేరుతో ముద్రగడ పద్మనాభం తునిలో ఓ సభ నిర్వహించారు. ఈ సభ కాస్తా ఆందోళనలకు తెరలేపింది. ఆ ఆందోళనలు అదుపు తప్పి.. ప్రయాణీకులతో వెళ్తున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ను తగులపెట్టారు. ఈ ఘటన రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే ఓ సంచలనంగా మారింది. అలాంటి కేసు ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్గా మారింది.
ప్రస్తుతం ఈ కేసును తిరిగి దర్యాప్తు చేయాలని ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ వెంటనే అలాంటిది ఏం లేదని.. జారీ అయిన జీవోను వెంటనే రద్దు చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు జరపాలని ఎందుకు అనుకుంది? మళ్లీ వెంటనే వెనకడుగు ఎందుకు వేసింది? అనేదే ఇప్పుడు చర్చ. తుని ఘటన తర్వాత అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ముద్రగడ పద్మనాభం సహా.. అనేక మందిపై కేసులు నమోదు చేసింది. రైల్వే ఆస్తులకు నష్టం వాటిల్లడంతో.. రైల్వే అధికారులు కూడా కఠినమైన సెక్షన్లు పెట్టి కేసులు నమోదు చేశారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. ఈ కేసులను ఎత్తివేసింది. 2021లో విజయవాడలోని 7వ మెట్రోపాలిటన్ అదనపు జడ్జ్, కోర్ట్ ఫర్ రైల్వేస్ కూడా ఈ కేసులను కొట్టివేసింది.
ఇలా అన్ని కేసులు కొట్టివేసిన తర్వాత ఉన్నట్టుండి ప్రభుత్వం నుంచి ఈ కేసులను తిరిగి పునర్విచారించాలంటూ హైకోర్టులో అప్పీల్కు వెళ్లాలంటూ జీవో జారీ అయ్యింది. ఇందులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ కేసులో ముఖ్యులైన ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా, కామన ప్రభాకర్రావులాంటి వారికి మళ్లీ చిక్కులు తప్పవని తేలిపోయింది. కానీ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది . తుని కేసును కొట్టేస్తూ రైల్వే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్కు వెళ్లే ఆలోచన లేదని ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
అసలు జీవో ఎందుకు ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? ఎవరి పర్మిషన్తో జీవో బయటికి వచ్చింది? అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఎందుకంటే తుని కేసును తట్టి లేపడమంటే.. ఏపీలో మరో తేనే తుట్టెను కదిపినట్టే. మొత్తం కాపు సామాజికవర్గాన్ని కదిలించినట్టే. అంతటి సున్నితమైన అంశం గురించి ఆదేశాలు వెలువడే ముందు కనీసం ఎందుకు క్రాస్ చెక్ చేసుకోలేదు అనేది ఇప్పుడు క్వశ్చన్. అసలు ప్రభుత్వ పెద్దల దృష్టికి రాకుండానే ఈ జీవో వెలువడిందనేది మాత్రం తెలుస్తోంది. అందుకే జీవో విడుదలై వారి దృష్టికి రాగానే వెంటనే నష్ట నివారణ చర్యలు తీసుకున్నారు. క్లారిటీ ఇస్తూ.. జీవోను వెనక్కి తీసుకున్నారు.
ఏ స్థాయి అధికారి ఆమోదంతో ఈ ఫైల్ మూవ్ అయ్యింది.. ఎందుకు జీవోగా మారింది అనే దానిపై ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. అసలు సీఎంవో పెద్దల జోక్యం లేకుండా.. సీఎస్ పరిశీలించకుండా.. సీఎం చంద్రబాబు ఓకే అనకుండా ఇలాంటి అత్యంత ముఖ్యమైన జీవో ఎలా బయటికి వచ్చిందనేది ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. అది కూడా కూటమి ప్రభుత్వం తన ఏడాది పాలనను పూర్తి చేసుకుంటున్న సమయంలో ఈ జీవో రావడం మరిన్ని అనుమానాలకు తెరలేపుతోంది. దీని వెనక మరేదైనా కుట్ర ఉందా? లేక అధికారుల తప్పిదమేనా? అనే దానిపై ఇప్పుడు ఏపీ ప్రభుత్వ పెద్దలు ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది.
http://www.teluguone.com/news/content/suspicions-of-conspiracy-in-tuni-rail-burn-case-retrail-39-199267.html












