రాష్ట్రపతి ముర్ముతో మోడీ, షా వరస భేటీల వెనక మర్మమేంటి??
Publish Date:Aug 4, 2025
Advertisement
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒకే రోజున గంటల వ్యవధిలో భేటీ కావడం ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరి వరుస భేటీల వెనక కారణాలు తెలియనప్పటికీ గంటల వ్యవధిలోనే ఇరువురు కీలక నేతలు రాష్ట్రపతితో సమావేశం కావడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. నిజానికి.. ప్రధాని నరేంద్ర మోదీ వరసగా రెండు రోజులు అంటే శని, ఆది(ఆగష్టు 2, 3) వారాలలో రాష్ట్రపతితో భేటీ అయ్యారు. అలాగే.. ఆదివారం (ఆగష్టు 3) ప్రధాని, హోం మంత్రి అమిత్ షా వెంట ఒకరు రాష్ట్రపతితో సమావేశమైన తర్వాత కాబినెట్ సెక్రటరీ, హోం సెక్రటరీ కూడా రాష్రపతితో భేటీ అయ్యారు. అలాగే.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా గత రెండు రోజులో ఎన్డీఏ భాస్వామ్య పక్షాల నాయకులతో, ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు, బీహార్ ముఖ్యమంత్రి, జేడీ(యు) అధినాయకుడు నితీష్ కుమార్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది. మరో వంక జులై 21న మొదలైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 12 వరకు జరగనున్నాయి. ఇటీవలే ఆపరేషన్ సిందూర్పై ఉభయ సభల్లో చర్చ జరిగింది. ఆ తర్వాత బిహార్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషన్ నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంపై పార్లమెంటులో ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం ఏదో తీసుకోనుందా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్త మవుతున్నాయి. ప్రధాని, హోంమంత్రిులు గంట వ్యవధిలో ఒకే రోజు వేర్వేరుగా రాష్ట్రపతితో భేటీ ఆ అనుమానాలకు మరింత బలం చేకూరేలా చేసింది. అయితే.. రాష్ట్రపతితో ప్రధానమంత్రి, హోంమంత్రి సమావేశాల వెనుక గల కారణాలు ఏమిటన్నది తెలియక పోయినా, ఉమ్మడి పౌర స్మృతి (యుసీసీ) వంటి కీలక నిర్ణయం తీసుకోవచ్చనీ అందుకే ప్రధాని, హోం మంత్రితో పాటుగా ఉన్నతాధికారులు రాష్ట్రపతితో భేటీ అయ్యుండవచ్చనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఇటీవల యునైటెడ్ కింగ్డమ్, మాల్దీవుల పర్యటనల అనంతరం ప్రధాని లాంఛనంగా మాత్రమే రాష్ట్రపతితో ప్రధాని సమావేశం అయ్యారనీ, అదే విధంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా నేపధ్యంలో సెప్టెంబర్ 9న ఉప రాష్ట్ర పతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంపై ప్రధాని మోదీ రాష్టపతిని స్వయంగా కలిసి ఆ వివరాలను తెలియచేసి ఉండవచ్చని అంటున్నారు. కాగా.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఉప రాష్ట్రపతి పదవికి గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ పేరు ఇంచు మించుగా ఖరారైనట్లు తెలుస్తోంది. కాగా.. ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కరే రాష్ట్రపతి ద్రౌపతి ముర్మతో సమావేశం అయి ఉంటే ,ఆది సాధారణ సమావేశం అనుకోవచ్చును కానీ.. ప్రధాని ఆ వెంటనే హోమ్ మంత్రి .. ఆతర్వాత కాబినెట్ సెక్రటరీ, హోం సెక్రటరీలు కూడా రాష్ట్రపతితో సమావేశం కావడంతో ఏదో జరగబోతోందన్న వ్యుహాగానాలు వినిపిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/secret-behind-series-of-meetings-with-president-murmu-39-203438.html





