సీఎం రేవంత్కు చురకలంటించిన ప్రధాని మోదీ
Publish Date:May 10, 2026
Advertisement
సీఎం రేవంత్ రెడ్డి గారు నా మాటలు జాగ్రత్తగా వినండి మోదీ చురకలు... గుజరాత్తో సమానంగా తెలంగాణకు నిధులు ఇస్తామని ప్రధాని మోదీ అన్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా సుమారు రూ.9,500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు. ఉమ్మడి ఏపీకి రైల్వే బడ్జెట్ల్లో రూ.1000 కోట్లు కూడా దక్కేవి కావు. ఇప్పుడు ఒక్క తెలంగాణకే రూ.5,500 కోట్లు కేటాయించం..సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది వింటున్నారా అని మోదీ చురకలంటించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం భరోసా ఇస్తుందని తెలిపారు. హైవేలకు లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. హైటెక్ సిటీలోని హెచ్ఐసీసీలో జరిగిన ఈ అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా రవాణా, పరిశ్రమలు, మరియు ఆరోగ్య రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులపై ప్రధాని దృష్టి సారించారు. ఇందులో భాగంగా వరంగల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న 'పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్'ను మోదీ ప్రారంభించారు. ఇది రాష్ట్రంలోని చేనేత మరియు జౌళి రంగానికి గ్లోబల్ గుర్తింపు తీసుకువస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంత విస్తరణకు సంబంధించి కీలక శంకుస్థాపనలు చేశారు. రహదారి మార్గాల అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్-పనాజీ ఆర్థిక కారిడార్లో నేషనల్ హైవే-167 పనులకు మోదీ పునాది వేశారు. సుమారు రూ.3,180 కోట్లతో చేపట్టనున్న ఈ రహదారి పనులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే తెలంగాణ, కర్ణాటక మరియు గోవా రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ మెరుగుపడనుంది. వీటితో పాటు మల్కాపూర్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి గ్రీన్ఫీల్డ్ టెర్మినల్ మరియు కాజీపేట-విజయవాడ మధ్య ట్రిపులింగ్ రైల్వే పనులకు కూడా పచ్చజెండా ఊపారు. ఆరోగ్య రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, హైటెక్ సిటీ ప్రాంతంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన మల్టీ-సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ ఆసుపత్రిని ప్రధాని మోదీ దేశానికి అంకితం చేశారు.
http://www.teluguone.com/news/content/pm-modi-hyderabad-visit-36-219391.html





