పుట్టపర్తిలో రక్షణ రంగ ప్రాజెక్టులు వద్దంటున్న పేర్ని నాని.. ఎందుకంటే?
Publish Date:May 15, 2026
Advertisement
తిన్నామా పడుకున్నామా తెల్లారిందా.. అన్నట్టు బటన్ నొక్కామా.. జనాన్ని బుట్టలో పడేసుకున్నామా.. దాని వెనక స్కాములు చేసుకున్నామా? అన్నట్టు సాగిన వైసీపీ పాలనకు నేడు కూటమి చేస్తున్న పాలనకూ ఎంతో తేడా ఉందని అంటారు విశ్లేషకులు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏపీలో వరుస ప్రాజెక్టులను తీసుకొస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాల కేంద్రంగా రాష్ట్రాన్ని మారుస్తోంది. అందులో భాగంగా.. సత్యసాయి జిల్లా పుట్టపర్తి సమీపంలో భారీ రక్షణ రంగ ప్రాజెక్టులకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఏపీ సీఎం చంద్రబాబు కలిసి శుక్రవారం ( మే 15) శంఖుస్థాపన చేశారు. పుట్టపర్తి సమీపంలోని గొల్లపల్లి వద్ద పదివేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్కు వీరు పునాదిరాయి వేశారు. యుద్ధ విమానాల విడిభాగాల తయారీ, అడ్వాన్స్డ్ రాడార్ సిస్టమ్స్, క్షిపణి వ్యవస్థలకు సంబంధించిన కీలక పరికరాల ఉత్పత్తి ఇక్కడి నుంచి చేస్తారు. ఈ యూనిట్ ఏర్పాటులో డీఆర్డీవో సాంకేతిక సహకారం అందిస్తోంది. పుట్టపర్తిలో ఇప్పటికే ఉన్న విమానాశ్రయం, రక్షణ రంగ రవాణాకు, విమానాల టెస్టింగ్ కు అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతంలో సుమారు 15 వేల నుంచి 20 వేల మంది వరకూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఒక అంచనా. అయితే ఈ పరిశ్రమ ఇక్కడ స్థాపించడంపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్లు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. సాధారణంగా ఇలాంటి రక్షణ కేంద్రాలు శత్రువుల నిఘాలో ఉంటాయనీ, అందుకే వాటిని ఇక్కడ ఏర్పాటు చేయవద్దనీ అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. అయితే, ప్రభుత్వం దేశ రక్షణకు అవసరమైన ఎస్-400 వంటి అత్యాధునిక రక్షణ కవచాలు ఇక్కడ ఉంటాయని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తోంది. ఇక పుట్టపర్తిలో జరుగుతోన్న శంఖుస్థాపన ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అతిపెద్ద డిఫెన్స్ హబ్గా మార్చే దిశగా ఒక పెద్ద అడుగు పడిందని అంటున్నారు రక్షణరంగ నిపుణులు. దీంతో పుట్టపర్తి లాంటి ఆధ్యాత్మిక కేంద్రం ఇప్పుడు పారిశ్రామిక కేంద్రంగానూ మారబోతోందంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రక్షణ, అంతరిక్ష రంగాలకు హబ్గా మారుతోంది. రాష్ట్రంలో ఉన్న ఈ కోవకు ప్రధాన సంస్థలు ఏమిటన్నది ఒకసారి పరిశీలిస్తే.. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్- , దేశంలోని ఏకైక అంతరిక్ష ప్రయోగ కేంద్రం. అలాగే బాపట్ల జిల్లాలోని నాగాయలంక వద్ద క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. కృష్ణా జిల్లాలోని నిమ్మకూరులో అడ్వాన్స్డ్ నైట్ విజన్ ప్రొడక్ట్స్ తయారీ కేంద్రం ఉంది.ఎన్ఎస్టీఎల్.. - విశాఖపట్నంలో ఉన్న ఈ సంస్థ నౌకాదళానికి అవసరమైన టార్పెడోలు, మైన్లను తయారు చేస్తుంది. విశాఖలోని అచ్యుతాపురంలోనూ బార్క్ కు సంబంధించిన వ్యూహాత్మక ప్రాజెక్టులున్నాయి. పేర్ని నాని వ్యాఖ్యలు ప్రధానంగా ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని కాకుండా రాజకీయ విమర్శల్లో భాగంగా చేసినవన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. సాంకేతికంగా, దేశ రక్షణ అవసరాల దృష్ట్యా ఇలాంటి పరిశ్రమలు రాష్ట్రానికి రావడం అభివృద్ధికి సంకేతం, అవసరం కూడా అని అంటారు నిపుణులు.
దేశంలో ఎక్కడ రక్షణ పరిశ్రమ పెట్టినా.. అది శత్రువుల నిఘాలో ఉంటుంది. అది పుట్టపర్తి అయినా, బెంగళూరులోని- హెచ్ఏఎల్ అయినా ఒకటే. అందుకే ఇలాంటి ప్రాంతాల వద్ద గగనతల రక్షణ వ్యవస్థలు ఎంతో బలంగా ఉంటాయి. రక్షణ పరిశ్రమలు రావడం వల్ల.. వేల కోట్లలో పెట్టుబడులు, వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. పాకిస్థాన్ టార్గెట్ చేస్తుంది అని భయపడి పరిశ్రమలు పెట్టకపోతే అభివృద్ధి కుంటుపడుతుంది. పాకిస్థాన్ సరిహద్దు నుంచి ఆంధ్రప్రదేశ్ చాలా దూరంలో ఉంది. ఉత్తర భారతం కంటే దక్షిణ భారతం ఇలాంటి వ్యూహాత్మక పరిశ్రమలకు ఎక్కువ సురక్షితమని రక్షణ నిపుణులు చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/perni-nani-opposes-defense-sector-projects-in-puttaparthi-39-219860.html




