వైసీపీ హయాంలో పార్టీ కార్యకర్తలకే ఉద్యోగాలు!
Publish Date:Jun 19, 2026
Advertisement
గత వైసీపీ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకాల్లో మెరిట్ విద్యార్థులకు ఘోర అన్యాయం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అర్హత మార్కులు సాధించి, టాప్ ర్యాంకుల్లో నిలిచిన అభ్యర్థులను పక్కనబెట్టి.. కేవలం వైసీపీ కార్యకర్త అన్న అర్హత చూసి ఉద్యోగాలు కట్టబెట్టారని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 19 లక్షల మంది నిరుద్యోగులు ఈ పరీక్షలు రాయగా, అందులో లక్షా పాతిక వేల మందికి నియామకాలు జరిగాయి. అయితే, ఈ ప్రక్రియలో అత్యంత తీవ్రమైన అక్రమాలు చోటుచేసుకున్నాయనే నిజాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ విషయంపై వాస్తవవేదికలో తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్రప్రసాద్ లో విశ్లేషణాత్మక చర్చ జరిపారు. సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలో 1 నుంచి 8000 లోపు అత్యుత్తమ ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కలేదనీ, 8000 దాటి ఆ పైన దారుణమైన ర్యాంకులు వచ్చిన వారికి ఉద్యోగాలు కేటాయించారనీ, ఈ విషయాన్ని బాధితులే తనతో స్వయంగా చెప్పారనీ రవిశంకర్ అన్నారు. దీనిపై అప్పట్లో నిరుద్యోగులు ప్రశ్నించగా, మేము నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చాం కానీ, మీకే ఇస్తామని చెప్పలేదు కదా! మా వాళ్లకు మేము ఇచ్చుకుంటున్నాం, గెటౌట్ అంటూ ఒక అప్పటి మంత్రి ఒకరు నిర్మొహమాటంగా ముఖం మీదే చెప్పినట్లు బాధితులు వాపోతున్నారన్నారు. అలాగే అప్పటి నియామకాల్లో దివ్యాంగుల కోటాలో భారీ అక్రమాలు జరిగాయనీ, తన పరిశీలనలో ఈ విషయం తేటతెల్లైందనీ రవిశంకర్ అన్నారు. కృష్ణా, శ్రీకాకుళం లాంటి పలు జిల్లాల్లో దివ్యాంగుల కోటాలో ఉద్యోగాలు పొందిన వారంతా కేవలం హియరింగ్ ఇంపైర్డ్ అంటే (వినికిడి లోపం ఉన్నట్లు సర్టిఫికెట్లు సమర్పించిన వారేనన్నారు. కేవలం నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు సృష్టించుకుని వచ్చిన వైసీపీ కార్యకర్తలకే ఈ పోస్టులు కట్టబెట్టారనే బలమైన ఆరోపణలు ఉన్నాయన్నారు. వ్యవస్థలో వేళ్లు ఊనుకుపోయిన ఈ రాజకీయ నియామకాల వల్ల ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి పరిపాలనా పరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని డోలేంద్ర ప్రసాద్ అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సచివాలయ సిబ్బంది అంతా వైసీపీకి అనుకూలంగా ఉండటం వల్ల.. ప్రభుత్వ పథకాలు సరిగ్గా అమలు కావడం లేదనే అసంతృప్తి ప్రజలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోందన్నారు. తెలుగుదేశం కేడర్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోందని డోలేంద్ర ప్రసాద్ చెప్పారు. క్షేత్రస్థాయి వాస్తవాలను, కార్యకర్తల గళాన్ని పట్టించుకోకుండా.. కార్పొరేట్ వ్యూహకర్తలపైనే ఎక్కువగా ఆధారపడటం వల్ల తెలుగుదేశం కూటమి ప్రభుత్వ పెద్దలు ఈ లోపాలను సరిదిద్దలేకపోతున్నారని చెప్పారు. అర్హత ఉండి వీధిన పడ్డ 17 లక్షల మందికి పైగా అభ్యర్థులకు న్యాయం చేయాలంటే, గతంలో జరిగిన సచివాలయ నియామక ప్రక్రియ మొత్తాన్ని రీఓపెన్ చేసి సమగ్ర విచారణ జరపాలన్నారు. అక్రమంగా సర్టిఫికెట్లు పొంది ఉద్యోగాల్లో చేరిన వారిని తొలగించి, నిజమైన మెరిట్ అభ్యర్థులకు అవకాశం కల్పించకపోతే భవిష్యత్తులో ప్రభుతం నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని రవిశంకర్, డోలేంద్రప్రసాద్ అభిప్రాయపడ్డారు.
http://www.teluguone.com/news/content/obs-for-party-workers-only-during-the-ycp-regime-39-223531.html





