ఇంద్రపాలనగరం గుట్టపై కొత్త రాతి యుగపు ఆనవాళ్లు!
Publish Date:Mar 20, 2026
Advertisement
యాదాద్రి -భువనగిరి జిల్లా రామన్నపేట మండలం, ఇంద్రపాలనగరం-తుమ్మలగూడెం శివారులో, మూసీనది ఒడ్డున గల శంకరగుట్ట పైనున్న కొత్తరాతి యుగపు ఆనవాళ్లను కాపాడుకోవాలని, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. గుట్ట పైన ఉన్న పార్వతి శంకర స్వామి ఆలయ పరిసరాల్లోనున్న కళ్యాణి చాళుక్యుల కాలపు శిలాతోరణ శకలాలను, శాసనాలు పరిశీలించడానికి వెళ్లిన ఆయన, 100 మీటర్ల దూరంలో గల మరో ఆలయం కుడివైపునున్న బండపై రెండు చోట్ల.. నాలుగువేల సంవత్సరాల పురాతనమైన రాతి గొడ్డళ్లను పదును పెట్టడానికి నూరిన గాళ్లు కనిపించాయని, అవి కొత్త రాతియుగానికి చెందినవని చెప్పారు. సమీపంలో మూసీ నది నీటి వనరుగానూ, గుట్టపైనున్న సహజ సిద్ధమైన రాతి ఆవాసాలు తాత్కాలిక నివాసాలుగానూ ఉపయోగపడి ఉంటాయని శివనాగిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత పురాతన దేవాలయ పునరుద్ధరణ సంస్థ, అధ్యక్షులు, ఆర్కే జైన్, యువ పురవస్తు పరిశోధకుడు పాములపాటి శ్రీనాథ్ రెడ్డి పాల్గొన్నారు.
http://www.teluguone.com/news/content/new-stone-age-traces-on-indrapalanagaram-hill-36-215806.html





