వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించండి : మంత్రి లోకేష్
Publish Date:Jun 26, 2026
Advertisement
రాష్ట్రంలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో మరింతగా అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్జీజీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఆర్టీజీఎస్పై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ లక్ష్యాలు, ప్రాజెక్టుల ప్రగతిపై ఆ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రభుత్వ శాఖల సమాచారాన్ని క్రోడీకరించేందుకు చేపట్టిన డేటాలేక్ పనులన్నీ జులై నాటికి పూర్తికావాలని మంత్రి ఆదేశించారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో అడ్డంకులు తొలగించాలి. రేషన్ కార్డుల విభజన, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం, తొలగించే ప్రక్రియను మరింత సులభతరం చేయాలి. సంజీవని కార్యక్రమాన్ని కూడా డేటా లేక్ తో అనుసంధానించాలి. పాఠశాలల్లో డ్రాప్ అవుట్లను డేటా లేక్ ద్వారా విశ్లేషించి, తగ్గించడానికి గల మార్గాలను అన్వేషించాలి. విద్యారంగంలో సమగ్ర సమాచారాన్ని ట్రాక్ చేస్తున్నాం. అన్ని శాఖల సమాచారం డేటా లేక్ ద్వారా అనుసంధానం కావాలని మంత్రి సూచించారు. మనమిత్ర ప్రజలకు మరింత చేరువ కావాలి ప్రజల్లో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై మరింతగా అవగాహన కలిగేలా నెలరోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ప్రజలకు కలిగే ఉపయోగం, వినియోగం, సులభంగా ప్రభుత్వ సేవలు ఎలా పొందవచ్చో ప్రజలకు వివరించాలన్నారు. సర్టిఫికెట్ల వెర్ఫికేషన్కు ఆధార్ విద్యార్థులు, అభ్యర్థులకు విద్యా-క్రీడా సంస్థలు ఇచ్చే సర్టిఫికెట్లు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లన్నీ అభ్యర్థి ఆధార్ నెంబర్ ఆధారంగా పారదర్శకంగా పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అభ్యర్థి ఆధార్ నంబర్ కొడితే ఆ విద్యార్థి లేదా అభ్యర్థికి ఆ సర్టిఫికెట్లు ఏ సంస్థ, ఎప్పుడు, ఎవరు జారీ చేశారనే వివరాలు కూడా రియల్ టైమ్లో తెలిసేలా డీజీ వెరిఫైని పకడ్బందీగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. దీనివల్ల 99 శాతం అధికారుల పని కూడా సులభతరం అవుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఇచ్చే వేలాది పోస్టుల నోటిఫికేషన్లకు, లక్షల సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారని, వీరందరి సర్టిఫికెట్లు పొందుపరచడంలో ఇబ్బందులు లేకుండా డీజీ వెరిఫైని సమర్థవంతంగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొందాం రాష్ట్రంపై ఎల్నినో ప్రభావంపైనా మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. ఎల్నినో ప్రభావంతో ఎదురయ్యే వర్షాభావ పరిస్థితులను జలవనరుల శాఖ, వ్యవసాయ శాఖ, ఇతర శాఖలన్నీ కూడా సమన్వయంతో, ప్రణాళికాబద్ధంగా పనిచేసి సమర్థవంతంగా ఎదుర్కొందామన్నారు. నీరు వృథాను అరికట్టి, తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించే దిశగా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. జలాశయాల్లో నీటి లభ్యత ఎంత ఉంది, భూగర్భజల మట్టాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది ఆర్టీజీఎస్లోని అవేర్ విభాగం ద్వారా రియల్ టైమ్లో ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆ దిశగా అధికారులు కార్యాచరణ చేపట్టాలి. రాయలసీమలో నీటి ఎద్దడి లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. యూరియా సరఫరాపైనా మంత్రి ఆరా తీశారు. విద్యుత్ డిమాండ్ పైనా దృష్టి కేంద్రీకరించాలి వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జల విద్యుత్ ఉత్పత్తి తగ్గడంతో ఎదురయ్యే సమస్యలు అధిగమించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని మంత్రి సూచించారు. జలాశయాల్లో నీటి మట్టాలు, పెరుగుతున్న విద్యుత్తు వినియోగం, భూగర్భ జలాలు వీటన్నిటినీ క్రోడీకరించి ఆర్టీజీఎస్లోని అవేర్ విభాగం విశ్లేషించి అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందజేయాలి. విద్యుత్తు సరఫరాకు ఎక్కడా ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో సీసీఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్, సంయుక్త కార్యదర్శి మాలిక గార్గ్, ఆర్టీఐహెచ్ సీఈవో ధాత్రి రెడ్డి, ఫైబర్నెట్ ఎండీ గీతాంజలి శర్మ, సివిల్ సప్లైస్ కమిషనర్ కన్నబాబు, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నారాయణ భరత్ గుప్త, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా, వ్యవసాయ శాఖ డైరెక్టర్ మన్జీర్ జిలానీ పాల్గొన్నారు.
http://www.teluguone.com/news/content/minister-lokesh-in-review-on-rtgs-36-224261.html





