పల్నాడులో భారీ రుణ మేళా.!
Publish Date:Jul 17, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజకీయంలోనే కాకుండా ఆర్థిక రంగంలో సరికొత్త చరిత్రకు పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట వేదికైంది. వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించి, పారిశ్రామిక, ఆర్థిక, సామాజిక రంగాలు సరికొత్త పుంతలు తొక్కేలా కేంద్ర, రాష్ట్ర కూటమి ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ రుణమేళా నిర్వహించాయి. శుక్రవారం (జులై 17) జరిగిన మెగా క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రామ్కు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై.. ఈ ప్రాంతంలో ఒక కొత్త ఆర్థిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. నరసరావుపేటలోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో జరిగిన సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఈ భారీ రుణమేళా ద్వారా పల్నాడు జిల్లా వ్యాప్తంగా లక్షా మూడు వేల 246 మంది లబ్ధిదారులకు 3 వేల 216 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే జిల్లా పరిధిలో ఇంత భారీ స్థాయిలో బ్యాంకింగ్ రంగాన్ని భాగస్వామ్యం చేస్తూ ఆర్థిక సాయం అందించడం ఒక రికార్డుగా నిలిచింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు నాయుడు సంయుక్తంగా యూనియన్ బ్యాంక్ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సమకూర్చిన అంబులెన్స్లను జెండా ఊపి ప్రారంభించారు. అదేవిధంగా పాఠశాల విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. పల్నాడు వెనుకబాటుతనాన్ని సమూలంగా తుడిచిపెట్టాలనే దృఢ సంకల్పంతో బ్యాంకర్లు, ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాయి. బ్యాంకులు నేరుగా ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లి ఎటువంటి కాగితాల వేధింపులు లేకుండా రుణాలు మంజూరు చేసే ప్రక్రియను చేపట్టడం విశేషం. ముఖ్యంగా పల్నాడు జిల్లాలోని 28 మండలాల్లో క్లస్టర్ ఆధారిత మహిళా గ్రూపులను బలోపేతం చేసేందుకు మహిళా క్లస్టర్ల ను ఏర్పాటు చేశారు. డ్వాక్రా సంఘాల మహిళలకు పెద్దపీట వేస్తూ వారి స్వయం ఉపాధికి భారీగా రుణాలు అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా ఆదివాసీ గిరిజన రైతుల వ్యవసాయ భూములను బ్యాంకర్లు కుదువ పెట్టుకుని రుణాలు మంజూరు చేసే విప్లవాత్మక నిర్ణయానికి ఇక్కడ నుంచే శ్రీకారం చుట్టారు. దీనివల్ల గిరిజన రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల చేతుల్లో చిక్కి మోసపోకుండా అధికారిక బ్యాంకింగ్ పరిధిలోకి రానున్నారు. అలాగే క్లీన్ ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహించేందుకు గాను జిల్లాలోని 7 గ్రామాలను ఒక ప్రత్యేక యూనిట్గా ఎంపిక చేసి పీఎం సూర్య ఘర్ పథకం కింద ప్రతి ఇంటికీ సోలార్ విద్యుత్ రుణాలు అందజేశారు. ఈ మెగా లోన్ మేళాలో కేవలం వ్యవసాయ రంగానికే పరిమితం కాకుండా కిసాన్ క్రెడిట్ కార్డులు, పశుసంవర్ధక, మత్స్యకార రంగాలు, అలాగే ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం పీఎం ముద్ర యోజన , పీఎంఈజీపీ , పీఎం స్వనిధి, పీఎం విశ్వకర్మ వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద చిన్న వ్యాపారులకు ఆర్థిక చేదోడు అందించారు. వీటితో పాటు గృహ నిర్మాణం, వాహన, ఉన్నత విద్యా రుణాలు కూడా మంజూరు చేశారు. ఈ క్రెడిట్ అవుట్రీచ్ ద్వారా లబ్ధిదారులందరికీ రాబోయే ఒక నెల రోజుల్లోగా నిధులు నేరుగా వారి ఖాతాల్లోకి చేరనున్నాయి. Palnadu Credit Mela, Chandrababu Naidu, Nirmala Sitharaman, Narasaraopet Mega Loan Mela
http://www.teluguone.com/news/content/massive-loan-fair-in-palnadu-36-226280.html





