తాడేపల్లి ప్యాలెస్ దాటి రా.. చర్చకు సిద్ధం.. జగన్ కు లోకేష్ సవాల్!
Publish Date:Jun 18, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏసీ రూముల్లో కూర్చుని సోషల్ మీడియా వేదికగా అసత్యాలు ప్రచారం చేయడం కాదు.. ధైర్యముంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి నేరుగా చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ఉద్యోగాల భర్తీపై బహిరంగ చర్చకు తాను ఎప్పుడైనా సిద్ధమేనని లోకేష్ స్పష్టం చేశారు. గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో నిరుద్యోగులను ఘోరంగా వంచించిందని లోకేష్ ధ్వజమెత్తారు. తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పారదర్శకంగా మెగా డీఎస్సీ ప్రక్రియను చేపట్టి 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అడుగులు వేసిందని గుర్తుచేశారు. ఈ భర్తీ ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రతిపక్ష నేతలు 240కి పైగా కోర్టు కేసులు వేసి కుట్రలు పన్నారని ఆరోపించారు. కోర్టులు ఆ కేసులను కొట్టివేసినా.. ఇంకా బురదజల్లేందుకే వైకాపా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. త్వరలోనే మళ్లీ టెట్, డీఎస్సీ పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులకు నమ్మకం ప్రకటించారు. రాష్ట్ర హోంమంత్రి అనితపై వైసీపీ నేతలు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యక్తిగత అనుచిత వ్యాఖ్యలను లోకేష్ తీవ్రంగా ఖండించారు. మహిళల పట్ల వైకాపా నేతలకు ఉన్న సంస్కృతి ఇదేనా అని ప్రశ్నించారు. ఒక హోంమంత్రి అని కూడా చూడకుండా ఆమె దుస్తులు, బాడీ లాంగ్వేజ్పై నీచంగా మాట్లాడిన వ్యక్తిని మెచ్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి అభినందించడం దారుణమన్నారు. తమ కుటుంబ మహిళలను గతంలో అవమానించినా.. తాము మాత్రం ప్రతిపక్ష మహిళా నేతలను గౌరవిస్తామని, సోషల్ మీడియాలో హద్దులు దాటిన తమ కార్యకర్తలను సైతం జైలుకు పంపిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. బెంగళూరు, హైదరాబాద్ ప్యాలెస్లకే పరిమితం కాకుండా జగన్ క్షేత్రస్థాయిలోకి వస్తే నిజాలు తెలుస్తాయని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.4,000 వృద్ధాప్య పింఛన్, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలను పక్కాగా అమలు చేస్తోందని వివరించారు. ఐటీ ఆధారిత అప్లికేషన్ల ద్వారా ఓటర్ల నమోదు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తుంటే, అవగాహన లేని వైకాపా నేతలు ఓట్లు తొలగిస్తున్నారంటూ కొత్త డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. అభివృద్ధిపై చర్చకు జగన్ ఎక్కడికి రమ్మన్నా తానే వస్తానని లోకేష్ సవాల్ విసిరారు.
http://www.teluguone.com/news/content/lokesh-challanges-jagan-39-223418.html





