కొండా సురేఖ.. స్వయంకృతమేగా?
Publish Date:Sep 6, 2026
Advertisement
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కొండా సురేఖ ఎపిసోడ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. రేవంత్ తన కేబినెట్ నుంచి ఆమెను బర్త్ రఫ్ చేసిన తరువాత భవిష్యత్ కార్యాచరణపై ఎటూ తేల్చుకోలేక కొండా సురేఖ మల్లగుల్లాలు పడుతున్నారు. ఇటు కాంగ్రెస్ పొమ్మంది, అటు బీఆర్ఎస్ వదిలించేసుకుంది. ఇక మిగిలినది కాషాయం పార్టీయే.. అనుకుంటే.. ఆ పార్టీలోకి కొండా సురేఖ ఎంట్రీ అంత తేలిక కాదనేలా పరిస్థితులున్నాయి. ఓ పక్క కొండా సురేఖను బీజేపీ పార్టీలోకి ఆహ్వానించిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంటే.. మరో పక్క కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి తొలి నుంచీ కొండా సురేఖకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచీ ఆమె వ్యాఖ్యలు, వ్యవహార శైలీ వివాదాస్పదంగానే ఉన్నాయి. నటుడు నాగార్జున, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లపై అనుచిత వ్యాఖ్యలు ఆమె దూకుడు ఎంత హద్దులు మీరేదో తేటతెల్లం చేస్తున్నాయి. అయినా కూడా అప్పట్లో ఆ వివాదం నుంచి సీఎం ఆమెను బయటపడేశారనే చెప్పుకోవాలి. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వివాదాలను ఆమె స్వయంగా ఆహ్వానించి ఇబ్బందులు కొనితెచ్చుకున్నారు. ఇక తాజాగా కేబినెట్ నుంచి ఆమె ఉద్వాసనకు కారణం కూడా పట్టువిడుపులు లేకుండా వ్యవహరించిన ఆమె తీరే కారణమంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. కొండా సురేఖ పొలిటికల్ జర్నీ డోలాయమానంలో పడటానికి ఆమె స్వయంకృతాపరాధమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజకీయాలలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి అన్న నానుడి కొండా సురేఖకు అతికినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. కొండా సురేఖ కుమార్తె సుస్మిత పార్టీ నాయకత్వంపై, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికలలో పరకాల నియోజకవర్గ అభ్యర్థిత్వంపై సీఎం చేసిన ప్రకటనలను ఆమె వ్యతిరేకించారు. ఆ స్థానం తనదేనంటూ ఏకపక్షంగా ప్రకటించేశారు. దీంతో వివాదం తారస్థాయికి చేరుకుంది. పీసీసీ క్రమశిక్షణా కమిటీ కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తాను బాధ్యురాలను కాదంటూ సురేఖ ఎదురు తిరిగారు అయినప్పటికీ తన కుమార్తె వ్యాఖ్యలను ఆమె బహిరంగంగా ఖండించకపోవడంతో ఆమె పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినట్లుగానే కాంగ్రెస్ హైకమాండ్ భావించింది. తీరా పుట్టిమునగబోతోందని గ్రహించిన తరువాత నష్టనివారణ కోసం కొండా సురేఖ చేయని ప్రయత్నం లేదు. రాఖీ పండుగ సందర్భంగా రేవంత్ నివాసానికి వెళ్లి మరీ రాఖీ కట్టి వచ్చారు. ఆ తరువాత కొండా సురేఖ హస్తినకేగి మరీ తన పదవిని కాపాడుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. తన ఉద్వాసన ప్రకటన వెలువడటానికి ముందే కొండా సురేఖ హస్తినలో మీడియా ఎదుట.. భట్టి విక్రమార్క్ సతీమణి, మంత్రి పొంగులేటిలపై విమర్శలు గుప్పించి, వారికి ఇవ్వని క్రమశిక్ష నోటీసులు తనకు మాత్రమే ఎందుకిచ్చారంటూ సీఎంను నిలదీశారు. మొత్తంగా చిన్న సర్దుబాట, ఒక ఖండనతో పరిష్కారమయ్యే సమస్యను ఆమె తన ఉద్వాసన వరకూ తెచ్చుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. [Konda Surekha Political Sucide, Revanth Reddy, Telangana Congress, Cabinet dismissal, political controversy, Telugu One]
http://www.teluguone.com/news/content/konda-surekha-political-sucide-39-230828.html




