తెలంగాణ అస్తిత్వంపై కుట్రలు.. మూడు పార్టీలపై కవిత ఫైర్
Publish Date:Jun 28, 2026
Advertisement
ఉప్పల్లో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ.. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు కార్పొరేట్ శక్తులు కుట్రలు చేస్తున్నాయని, వాటిని బలపరుస్తున్నది బీఆర్ఎస్లోని కొందరు నాయకులేనని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఉప్పల్లో నిర్వహించిన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, తెలంగాణ ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మౌనం వహిస్తున్నాయని విమర్శించారు. ఉప్పల్ తెలంగాణ ఉద్యమానికి కేంద్రబిందువని పేర్కొన్న కవిత, అలాంటి ప్రాంతంలో పార్టీ జెండాను ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ హామీ ఇచ్చిన 250 గజాల స్థలాల కోసం జూలై 2న ఉప్పల్ భగాయత్లో భారీ భూపోరాటం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమకారులు, మహిళలు, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ రక్షణ సేన పోరాడుతుందని, అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని గతంలో అవహేళన చేసినవారే ఇప్పుడు మళ్లీ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 'ఇడుపు కాగితం' అనే పదాన్ని ఎగతాళి చేస్తున్న వారిపై స్పందిస్తూ, దాని అర్థం తెలుసుకోవాలంటే పవన్ కళ్యాణ్ను అడిగితే వివరిస్తారని వ్యాఖ్యానించారు. తెలంగాణ భాషను అవమానిస్తే సహించబోమని స్పష్టం చేశారు. గతంలో అవమానాలను ఎదుర్కొని తెలంగాణను సాధించుకున్నామని గుర్తు చేశారు. భాషలన్నింటినీ గౌరవించాలని, అయితే తెలంగాణ భాషను కించపరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణ భాషను అవమానిస్తున్న వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదని విమర్శించారు. బీజేపీ దేశ ప్రయోజనాల పేరుతో తెలంగాణ సమస్యలను విస్మరిస్తోందని, బీఆర్ఎస్ కూడా స్పందించడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్లోని కొందరు నాయకులు నారాయణ, చైతన్య విద్యాసంస్థలతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్నందువల్లే తెలంగాణ ప్రయోజనాలపై మాట్లాడడం లేదని ఆరోపించారు. నారాయణ, చైతన్యతో పాటు ఇతర కార్పొరేట్ విద్యాసంస్థలు, ఆస్పత్రుల్లో మదర్ డెయిరీ, ముల్కానూరు, విజయ డెయిరీల పాలనే వినియోగించేలా ప్రభుత్వం జీవో తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని, పాఠశాల ఫీజులను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. టీచర్లలో అధిక శాతం కేరళ, ఆంధ్రప్రదేశ్కు చెందిన వారినే నియమిస్తున్నారని, ఉత్తర భారతదేశానికి చెందిన విద్యాసంస్థలు కూడా చిన్న ఉద్యోగాల్లో స్థానికులకు అవకాశాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడేది తెలంగాణ రక్షణ సేన మాత్రమేనని కవిత పేర్కొన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన కార్పొరేట్ శక్తులను పెంచి పోషిస్తున్నది బీఆర్ఎస్లోని నాయకత్వమేనని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు, ఉద్యమకారుల కోసం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటానని, లాఠీలు, రబ్బరు తూటాలకు కూడా భయపడబోనని స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉప్పల్లోని అన్ని డివిజన్లలో పోటీ చేస్తామని, భవిష్యత్తులో ఉప్పల్ ఎమ్మెల్యే స్థానాన్ని కూడా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసే రాజకీయ పార్టీగా తెలంగాణ రక్షణ సేన పనిచేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ అమలయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
http://www.teluguone.com/news/content/kalvakuntla-kavitha-25-224416.html




