డెటా సెంటర్లే లక్ష్యం.. ఇరాన్ కొత్త యుద్ధ వ్యూహం.. బెంబేలెత్తుతున్న ప్రపంచదేశాలు!
Publish Date:Apr 4, 2026
Advertisement
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక దేశం ఉద్దేశపూర్వకంగా ఇతర దేశాల్లోని వాణిజ్య డేటా సెంటర్లను లక్ష్యంగా చేసుకోవడం అన్నది తొలిసారిగా కనిపిస్తోంది. అమెరికా సైనిక కార్యకలాపాలకు సాంకేతిక సహకారం అందిస్తున్నాయంటూ.. ఇరాన్ ఇప్పుడు టెక్ దిగ్గజాలైన అమెజాన్, ఒరాకిల్ వంటి సంస్థల డేటా సెంటర్లపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. బహ్రెయిన్లోని అమెజాన్ డేటా సెంటర్తో పాటు దుబాయ్లోని ఒరాకిల్ కేంద్రాలపై ఇరాన్ దాడులు చేసింది. గల్ఫ్ దేశాల్లో అమెరికాకు మద్దతుగా నిలుస్తున్న ప్రాంతాలను టార్గెట్ చేసి దెబ్బతీయడం ద్వారా తన పట్టును నిలుపుకోవడమే కాకుండా, అమెరికాను ఢిఫెన్స్ లో పడేసి తన పట్టు నిలుపుకోవాలని ఇరాన్ భావిస్తున్నది. గతంలో డేటా సెంటర్లు కేవలం హ్యాకింగ్ లేదా సైబర్ దాడులకు మాత్రమే పరిమితం అయ్యేవి.. అయితే ఇప్పుడు ఇరాన్ వాటిని దాడులతో నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందనిపిస్తున్నది. ఆధునిక యుద్ధ తంత్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర కీలకంగా మారింది. అమెరికా తన దాడులను పక్కాగా అమలు చేయడానికి, లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ఈ ఏఐ టెక్నాలజీనే వాడుతోంది. ఆ సాంకేతికతకు వెన్నుదన్నుగా, వెన్నెముకగా నిలుస్తున్న డేటా సెంటర్లపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేస్తే అమెరికా రక్షణ వ్యవస్థ బలహీనపడుతుందన్నది ఇరాన్ ఉద్దేశంగా, వ్యూహంగా కనిపిస్తున్నది. యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్ వంటి దేశాలు ప్రపంచ టెక్నాలజీ హబ్లుగా మారుతున్నాయి. అమెరికా టెక్ కంపెనీలు ఇక్కడ భారీగా ఇన్వెస్ట్ చేసి డేటా సెంటర్లను నిర్మిస్తున్నాయి. అయితే, ఇరాన్ దాడులు వాటికి పెను ముప్పుగా పరిణమించాయి. తమ దేశాలపై దాడులకు ఈ కేంద్రాల నుంచే సమాచారం అందుతోందని ఇరాన్ ఆరోపిస్తూ డేటా సెంటర్లను లక్ష్యం చేసుకుని దాడులు చేస్తున్నది. ఈ నేపథ్యంలో డేటా సెంటర్ల రక్షణ గల్ఫ్ దేశాలకు, అమెరికాకు, ఇంటర్నేషనల్ టెక్ కంపెనీలకు పెను సవాలుగా పరిణమించింది. ఎందుకంటే ఇరాన్ వీటిపై దాడులు కొనసాగిస్తూ పోతే.. ప్రపంచ డిజి టల్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పెనుముప్పు ఉంది.
http://www.teluguone.com/news/content/iran-targets-data-centers-36-216669.html





