హైదరాబాద్ మెట్రో రైల్.. ట్రయాంగ్యులర్ పొలిటికల్ వార్!
Publish Date:Jun 17, 2026
Advertisement
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, భారీ ప్రజా రవాణా వ్యవస్థల్లో ఒకటిగా నిలిచిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ ఇప్పుడు తెలంగాణలో ముక్కోణపు రాజకీయ పోరుకు తెరలేపింది. నిత్యం లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఈ మెట్రో ప్రాజెక్ట్ ఇప్పుడు రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ట్రయాంగ్యులర్ పోరుకు వేదిక అయ్యింది. కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీల ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు విషయంలో మాటల యుద్ధం జరుగుతోంది. ఈ పార్టీల మథ్య వాడివేడి చర్చలు, విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యామ్నాయాలతో రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. బిఆర్ఎస్ ప్రభుత్వంపై, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత బిఆర్ఎస్ పాలకులు ప్రజల అవసరాలను, ప్రజా డిమాండ్ను పూర్తిగా పక్కనబెట్టేశార ఆరోపించారు. కేవలం తమ ప్రయోజనాలు, ఆర్థిక లాభాల కోసమే ఈ ప్రాజెక్టును వాడుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రజలకు అత్యంత కీలకమైన, ఎక్కువ డిమాండ్ ఉన్న రూట్లలో మెట్రో లైన్లను కేటాయించకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిగా పాడు చేసిందన్నారు. అక్కడితో ఆగకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కూడా మెట్రో ప్రాజెక్టు అభివృద్ధికి సహకారం అందించడం లేదని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు రుణం అందకుండా అడ్డుకుంటున్నారనీ దుయ్యబట్టారు. ఈ విమర్శలపై బిఆర్ఎస్ నాయకత్వం ఘాటుగా స్పందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగా అదనపు మెట్రో లైన్లను సాధించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఎదురుదాడికి దిగింది. తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే రేవంత్ రెడ్డి తమపై విమర్శలు గుప్పిస్తున్నారంటూ మండిపడింది. ప్రాజెక్టును ప్రారంభించిన బిఆర్ఎస్ పాలనను విమర్శించడం మానేసి, కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ హైదరాబాద్ నగరానికి కొత్త మెట్రో రూట్లను తీసుకురావడంపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని హితవు పలికింది. ఇక బీజేపీ కూడా రేవంత్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేసింది. రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారనీ.. ఇప్పుడు వాటిని నెరవేర్చలేక చేతులెత్తేస్తున్నారని మండిపడింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై అబద్ధపు ఆరోపణలు చేస్తూ, తన వైఫల్యాలను బిజెపిపైకి నెట్టేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామన్న బిజెపి.. ఈ ప్రాజెక్టును సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే మేధోశక్తి, కార్యాచరణ రేవంత్ రెడ్డికి లేవని విమర్శించింది. మొత్తానికి ప్రజారవాణాకు అత్యంత కీలకమైన హైదరాబాద్ మెట్రో ఇప్పుడు పొలిటికల్ ట్రయాంగిల్ ఫైట్ కే కేంద్ర బిందువుగా మారింది.
http://www.teluguone.com/news/content/hyderabad-metro-rail-39-223207.html




