కాశ్మీర్ కు ఆ పేరు ఎలా వచ్చింది?
Publish Date:Apr 28, 2025

Advertisement
కాశ్మీర్ అనేది కేవలం ఒక భూభాగం కాదు. చరిత్ర, జానపద కథలు, సంస్కృతి పొరలతో చుట్టబడిన పేరు. కాశ్మీర్ గురించి తెలుసుకునే కొద్దీ లెక్కలేనన్ని కథలు బయటపడతాయి. ఒకప్పుడు 'భూమిపై స్వర్గం' అని పిలువబడే ఈ ప్రాంతం ఇప్పటికీ దాని అందానికి ప్రసిద్ధి చెందింది, అయితే దాని పేరు యొక్క మూలం చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. దీని గురించి తెలుసుకుంటే..
కాశ్మీర్ యొక్క పురాతన జానపద కథలు..
కాశ్మీర్ అనే పదం ఒక పాత జానపద కథలో మూలాలను కలిగి ఉన్నట్టు తెలుస్తుంది. ఈ లోయ ఒక పెద్ద సరస్సు ఎండిపోవడం ద్వారా ఉనికిలోకి వచ్చిందని చెబుతారు. వేల సంవత్సరాల నాటి జానపద కథ ప్రకారం కాశ్మీర్ ఒకప్పుడు ఒక పెద్ద సరస్సు. ఇక్కడ ఎవరూ నివసించేవారు కాదు. కేవలం నీరు మాత్రమే ఉండేది. తరువాత కశ్యప మహర్షి వచ్చాడు. ఈయన భృగు వంశానికి చెందిన వాడు. ఈయన కొండలను నుండి ఆ సరస్సు నీటిని బయటకు తీశాడట. ఇది మానవ నివాసానికి అనువైన భూమిని సృష్టించింది. అది చాలా అందంగా ఉండటంతో "భూతల స్వర్గం" అని పిలువబడిందట. తరువాత ఇది "కశ్యపమార్", తరువాత చివరకు నేటి "కాశ్మీర్" గా మారిందని చెబుతారు.
ఈ సరస్సు, కశ్యప మహర్షి కథ 12వ శతాబ్దపు చరిత్రకారుడు కల్హణుడు రాసిన రాజతరంగిణి పుస్తకంలో కూడా ప్రస్తావించబడిందట. ఏ భారతీయ గ్రంథంలోనైనా కాశ్మీర్ చారిత్రాత్మకంగా నమోదు చేయబడటం ఇదే మొదటిసారి. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ప్రణాళిక అభివృద్ధి, పర్యవేక్షణ విభాగం వెబ్సైట్లో కూడా ఇది ప్రస్తావించబడింది.
కాశ్మీర్ అనే పేరుకు అర్థం ఏమిటి?
సంస్కృతంలో “కా” అంటే జలం (నీరు), “షామిర” అంటే ఎండబెట్టడం అని అర్థం. దీని ప్రకారం, 'కాశ్మీర్' అనే పదానికి సాహిత్యపరమైన అర్థం "ఎండిన నీరు" అంటే నీటి నుండి బయటపడిన భూమి.
మరొక అభిప్రాయం ప్రకారం, 'కాస్' అంటే కాలువ లేదా వాగు, 'మీర్' అంటే పర్వతం. ఈ వివరణ ప్రకారం కాశ్మీర్ అంటే "పర్వతాల మధ్య ప్రవహించే ప్రవాహాల భూమి" అని అర్థం.
పురాతన గ్రంథాలు, విదేశీ పత్రాలలో కాశ్మీర్..
భారతదేశం నుండి మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం నుండి పండితులకు, ప్రయాణికులకు కాశ్మీర్ ఒక ఆకర్షణీయ కేంద్రంగా ఉంది. క్రీస్తుపూర్వం 550లో గ్రీకు చరిత్రకారుడు హెకాటేయస్ ఈ ప్రాంతాన్ని 'కాస్పాపిరోస్' అని పిలిచాడు. తదనంతరం, రోమన్ ఖగోళ శాస్త్రవేత్త టోలెమీ (క్రీ.శ. 150) దీనిని 'కాస్పెరియా' అని పిలిచాడు.
చైనా రికార్డులలో కూడా కాశ్మీర్ ప్రస్తావన ఉంది - దీనిని 'కి-పిన్' అని, టాంగ్ రాజవంశం కాలంలో 'కియా-షి-మి-లో' అని పిలిచేవారు. ఇది 7వ, 8వ శతాబ్దాల పత్రాలలో ఉందట.
అల్బెరుని కళ్ళ ద్వారా కాశ్మీర్ దృశ్యం..
11వ శతాబ్దపు ఖ్వరాజ్మీ పండితుడు భారతదేశపు మొదటి మానవ శాస్త్రవేత్త అని కూడా పిలువబడే అల్బెరుని, కితాబ్-ఉల్-హింద్లో కాశ్మీర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఇక్కడి భౌగోళిక నిర్మాణంతో పాటు భాష, సమాజం, మతం, సంస్కృతిని కూడా ఆయన లోతుగా విశ్లేషించారు. అతని ప్రకారం కాశ్మీర్ మధ్య ఆసియా, పంజాబ్ మైదానాల మధ్య ఉన్న ఒక పర్వత ప్రాంతం. సంస్కృతి, ప్రకృతి రెండింటిలోనూ ఇది చాలా గొప్పది.
గుర్తింపు వ్యాప్తి..
13వ శతాబ్దపు ఇటాలియన్ యాత్రికుడు మార్కో పోలో కూడా కాశ్మీర్ గురించి ప్రస్తావించాడు. వారు దానిని 'కాశీమూర్' అని, దాని నివాసులను 'కాశ్మీరియన్లు' అని పిలిచారు. ఆ సమయంలోనే కాశ్మీర్ గుర్తింపు సుదూర దేశాలకు కూడా చేరుకుందని ఆయన రచనల ద్వారా స్పష్టమవుతోంది.
ఫిదా హస్నైన్ ప్రొఫెసర్ రాసిన చాలా ఆసక్తికరమైన, చర్చనీయాంశమైన సిద్ధాంతం. అతని ప్రకారం కాశ్మీరీ ప్రజల మూలాలు బాగ్దాద్ సమీపంలో స్థిరపడిన 'కాస్' అనే యూదు సమాజానికి చెందినవి. ఈ కులం క్రమంగా ఆఫ్ఘనిస్తాన్ మీదుగా హిందూకుష్ దాటి కాశ్మీర్ చేరుకుని ఇక్కడ స్థిరపడింది. ఈ సిద్ధాంతం ఇంకా విస్తృతంగా ఆమోదించబడనప్పటికీ ఇది ఖచ్చితంగా కాశ్మీర్ యొక్క వైవిధ్య గుర్తింపులోని మరొక కోణాన్ని చూపుతుంది.
జంబులోచన్ రాజు పాత్ర..
9వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు జంబులోచన్ కాలంలో కాశ్మీర్ అనే పేరు వచ్చిందని చాలా మంది స్థానికులు నమ్ముతారు. వారు స్థాపించిన నగరాలు, పరిపాలనా వ్యవస్థలు కాశ్మీర్కు ఒక సాంస్కృతిక నిర్మాణాన్ని అందించాయి. బహుశా ఈ ప్రాంతం 'కాశ్మీర్' అని పిలువబడిన సమయం ఇదే అయి ఉండవచ్చు.
కాశ్మీర్ లోయలు ఎంత అందంగా ఉన్నా, దాని కథ కూడా అంతే మర్మమైనది. అందుకే కాశ్మీర్ కేవలం ఒక ప్రదేశం కాదు అదొక అనుభూతి. దానిని అర్థం చేసుకోవడానికి హృదయం, మనస్సు రెండూ అవసరం అని చెబుతారు.
*రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/history-of-kashmir-35-197051.html












