హిమాచల్లో వర్షాలకు కాదు మంచు కరిగి వరద.. ఝల్మా వాగులో చిక్కుకున్న పర్యాటకులు
Publish Date:Jun 29, 2026
Advertisement
హిమాచల్ ప్రదేశ్ ను మెరుపు వరదలు ముంచెత్తాయి. ఎండల తీవ్రతకు పర్వతాలపై మంచు చరియలు విరిగిపడటంతో లాహౌల్ స్పితి జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. సాధారణంగా భారీ వర్షాలకు వరదలు సంభవిస్తాయి. కానీ తాజాగా హిమాచల్ లో వర్షాలు లేకుండానే మంచు కరిగి వరదలు సంభవించాయి. ఈ ప్రకృతి ప్రకోపం కారణంగా ఝల్మా వాగులో నీటి ఉధృతి ప్రమాదకర స్థాయికి చేరి, అక్కడి రహదారిని ముంచెత్తింది. వరద తీవ్రతకు రహదారి తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా కొన్ని చోట్ల కొట్టుకుపోయింది. ఈ ఆకస్మిక వరద కారణంగా ఆ మార్గంలో ప్రయాణిస్తున్న పర్యాటకులు చిక్కకుపోయారు. దాదాపు 50 పర్యాటక వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. చుట్టూ కొండలు, మధ్యలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు, ముందుకు వెళ్లేందుకు వీల్లేని పరిస్థితి నెలకొనడంతో పర్యాటకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఈ విపత్తులో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. పర్యాటకుల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రకటించారు. సమాచారం అందిన వెంటనే సరిహద్దు రహదారి సంస్థ సిబ్బంది, స్థానిక యంత్రాంగం, రెస్క్యూ టీమ్లు రంగంలోకి దిగాయి. కొట్టుకుపోయిన రహదారిని పునరుద్ధరించేందుకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టి పూర్తి చేశారు. చిక్కుకుపోయిన పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
http://www.teluguone.com/news/content/floods-in-himachal-caused-by-melting-snow-36-224561.html





