గురి చూసి బాణాన్ని వదిలిన చంద్రబాబు
Publish Date:Oct 26, 2012
Advertisement
చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర.. తెలంగాణలో కూడా పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యేట్టు కనిపిస్తోంది. బాబు రాజోలిలో అడుగుపెట్టిన రోజున పొలిటికల్ జెఎసి నేతలు తీవ్రస్థాయిలో నిరసన తెలిపి అరెస్టైన విషయం తెలిసిందే. ముందుకు పోయినకొద్దీ చంద్రబాబుకి జనం మద్దతిస్తున్న తీరుని చూస్తుంటే.. శాంతి నగరంలో జెఎసి నేతలు చేసిందంతా స్టంటన్న విషయం చాలామందికి ఇట్టే అర్థమౌతుంది. పాదయాత్ర మొదలుపెట్టేముందు బాబు చేసిన రెండు పనులు ఆయనకు ఇప్పుడు బాగా కలిసొస్తున్నాయ్. తెలంగాణ విషయంలో కేంద్రానికి లేఖరాయడం వాటిల్లో ఒకటైతే, ఎస్సీల వర్గీకరణ రెండో అంశం. కులసమీకరణాల ఆధారంగా నడుస్తున్న రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కోవర్గం ఒక్కో పార్టీకి కొమ్ముకాస్తోంది. రెడ్లంతా కాంగ్రెస్, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పక్షాన నిలబడితే, వెలమలు టిఆర్ ఎస్ పక్షాన నిలుస్తున్నారు. ఇప్పుడు టీఆర్ ఎస్ లో కూడా వెలమ వర్సెస్ రెడ్డి ఆధిపత్యపోరు నడుస్తోందని కొందరు అనుకుంటున్నారు. మొదట్నుంచీ కాంగ్రెస్ కి అనుకూలంగా ఉండే కాపులు.. ఇప్పుడు చిరంజీవి రాకతో పూర్తిగా కాంగ్రెస్ వైపుకి మళ్లారు. ఇక మిగిలింది. బీసీల్లోని ఇతర కులాలు, ఎస్సీలు, ఎస్టీలు. వీళ్లని ఆకర్షించగలిగితే ఓటు బ్యాంక్ బలపడుతుందన్న చంద్రబాబు ఎత్తుగడ పారినట్టే కనిపిస్తోంది. తను అధికారంలోకి రాగానే మాదిగల రుణం తీర్చుకుంటానంటూ బాబు చేసిన వ్యాఖ్యలు జనంమీద బాగానే పనిచేస్తున్నాయ్. కేవలం తెలంగాణ ఏర్పాటు అనే మాట తప్ప తమకు ప్రత్యేకంగా టిఆర్ ఎస్ వల్ల ఒరిగేదేంలేదని తెలంగాణ ప్రాంతంలో ఉన్న బీసీలు గట్టిగా అనుకుంటున్నారు. ఆ కారణంగా వాళ్లంతా తెలుగుదేశం పార్టీ వైపుకే మొగ్గుచూపుతున్నట్టుగా కనిపిస్తోందని టిడిపి నేతలు అనుకుంటున్నారు. ఇదే నిజమైతే తెలంగాణలో టిడిపి బీసీల మద్దతు కంచుకోటలా మారే అవకాశముందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఈ విషయంలో చంద్రబాబు ఎత్తుగడని ఎలా ఎదుర్కోవాలో తెలీక మిగతా పార్టీలు తలలు బాదుకుంటున్నాయ్. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే రాబోయే రోజుల్లో చంద్రబాబు మరో సారి కాబోయే ముఖ్యమంత్రవుతారని టిడిపి క్యేడర్ బలంగా నమ్ముతోంది.
http://www.teluguone.com/news/content/chandrababu-meekosam-telangana-31-18519.html





