కాగల కార్యాన్ని బోండా ఉమ తీర్చేస్తున్నారుగా?
Publish Date:Jul 27, 2026
Advertisement
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవలి తీరు ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది. ఆయన అడుగులు తెలుగుదేశం పార్టీ నుంచి దూరంగా పడుతున్నాయా? అన్న చర్చ మొదలైంది. గతంలో కేశినేని నాని, అంతకంటే ముందు కొడాలి నాని, వంశీ వంటి నేతల బాటలోనే బోండా ఉమ అడుగులు పడుతున్నాయా అన్న అనుమానాలకు తావిస్తోందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి. గుంటూరులో జరిగిన ముద్రగడ సంస్మరణ సభ వేదికగా.. బోండా ఉమా చేసిన ప్రసంగం వైసీపీ స్వరం వినిపించేలా ఉంది. రాష్ట్ర జనాభాలో 25 శాతానికి పైగా ఉన్న కాపు సామాజిక వర్గానికి రాజకీయాల్లో, ప్రభుత్వ సంక్షేమ నిధుల్లో తగిన ప్రాధాన్యం లభించాలనీ, కాపుల ఆవేదనను, డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే ఆలకించి, వారికి న్యాయమైన వాటా దక్కేలా నిర్ణయాలు తీసుకోవాలని బోండా చేసిన వ్యాఖ్యలు.. ఇటీవలి కాలంలో వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలను బలపరిచేవిగా ఉన్నాయి. బొండా ఉమానే స్వయంగా తమ పార్టీ ప్రభుత్వ తీరును ఎత్తిచూపేలా మాట్లాడటం వెనుక ఉన్న వ్యాహంపై చర్చోపచర్చలు మరొకవైపు, గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై, పార్టీ సిద్ధాంతాలపై అత్యంత దారుణమైన పదజాలంతో విరుచుకుపడిన అంబటి రాంబాబుతో బోండా ఉమా వేదిక పంచుకోవడం, సన్నిహితంగా మెలగడం కూడా బోండా ఉమా రాజకీయ అడుగులు ఏ దిశగా పడుతున్నాయో తేటతెల్లం చేశాయంటున్నారు. తెలుగుదేశం అధినేతను వ్యక్తిగతంగా దూషించిన వ్యక్తితో వేదిక పంచుకోవడమే కాకుండా, ఆయనతో నవ్వుతూ ముచ్చటించడం ద్వారా బోండా ఉమా తీరుపై తెలుగుదేశం నేతలు, శ్రేణుల్లో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇక పోత తెలుగుదేశం కేడర్ మాత్రం ఉమా పార్టీని వీడితేనే మేలని అభిప్రాయపడుతోంది. ఆయన పార్టీని వీడ వరకూ ఆగకుండా తెలుగుదేశం అధిష్టానమే ఆయనను బహిష్కరించాలని కూడా కోరుకుంటోంది. ఎందుకంటే.. ఉమా తెలుగుదేశం పార్టీని వీడితే కాగల కార్యం గంధర్వులే తీర్చారన్న చంద్రంగా ఇంత కాలంగా విజయవాడ రాజకీయాలలో క్రియాశీలంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్న వంగవీటి రాధాకు మార్గం సుగమం అవుతుందని పార్టీ క్యాడర్ భావిస్తున్నది. రాబోయే రోజుల్లో బోండా ఉమా తన రాజకీయ ప్రయాణంపై ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఉమా నిజంగానే జెండా మారుస్తారా లేక పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచి తన ప్రాధాన్యాన్ని పెంచుకోవడానికి ఈ రకమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారా అనేది ఆసక్తికరంగా మారింది. విజయవాడ నగర రాజకీయాల్లో బోండా ఉమా తీసుకునే నిర్ణయం కూటమి ప్రభుత్వానికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రెండింటికీ ఎంతో కీలకమైనదిగా మారనుంది. 2024 ఎన్నికలలోనే తెలుగుదశం పార్టీ వంగవీటి రాధాను మచిలీపట్నం ఎంపీ సీటు లేదా ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి టికెట్ ఆఫర్ చేసింది. అయితే అప్పట్లో రాధా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి అయితేనే పోటీ చేస్తాననీ, లేకుంటే.. పోటీలో ఉండననీ స్పష్టం చేయడమే కాకుండా, పోటీ చేయకున్నా.. తెలుగుదేశం అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తానని చెప్పి అదే పని చేశారు. అప్పట్లో.. విజయవాడ సెంట్రల్ నుంచి అంతకుముందు ఎన్నికలలో స్వల్ప తేడాతో పరాజయం పాలైన బోండా ఉమాను పక్కన పెట్టడం ఇష్టం లేక వంగవీటి రాధా కోరినట్లుగా ఆ నియోజకవర్గ టికెట్ వంగవీటి రాధాకు ఇవ్వలేదు చంద్రబాబు. ఇప్పుడు బోండా ఉమానే తన వ్యవహార శైలితో కాగల కార్యాన్ని స్వయంగా ఆయనే నెరవేరుస్తున్నారని తెలుగుదేశం వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. బోండా ఉమా తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరితే.. వంగవీటి రాధా వచ్చే ఎన్నికలలో విజయవాడ సెంట్రల్ నుంచి పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతారనీ, అదే జరిగితే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మరింత బలపడే అవకాశాలు మెండుగా ఉంటాయంటున్నారు. అదే సమయంల వైసీపీలో బోండా ఉమా చేరిక ఆ పార్టీలో విభేదాలకు కారణమౌతుందనీ, విజయవాడలో ప్రస్తుతం వైసీపీ తరఫున చక్రం తిప్పుతున్న దేవినేని అవినాశ్, ఇతర నేతలు నిస్సందేహంగా వ్యతిరేకిస్తారనీ చెబుతున్నారు. మొత్తం మీద బోండా ఉమ పార్టీ మారతరన్న వార్తలు తెలుగుదేశం శ్రేణుల్లో జోష్ పింపుతుంటే.. వైసీపీ శ్రేణుల్లో గుబులు మొతలైందని పరిశీలకులు విశ్లేషిస్టున్నారు. Bonda Uma, Ambati Rambabu, TDP Political News, Vijayawada olitics, YCP Rumors
http://www.teluguone.com/news/content/bonda-uma-39-227229.html




