చంద్రబాబుకు మహిళా కమిషన్ నోటీసులు.. విజయవాడ ఘటనపై రివేంజ్ యాక్షన్!
Publish Date:Apr 23, 2022
Advertisement
ఉరుము ఉరిమి మంగళం మీద పడటమంటేఇదే! విజయవాడసామూహిక అత్యాచార ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు, స్థానికులలో ఆగ్రహం ఉవ్వెత్తున ఎగసింది. ఆ క్రమంలోనే బాధితురాలిని పరామర్శించడానికి వచ్చిన ఏపీమహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను బాధితురాలి బంధువులు అడ్డగించారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అయితే అదే సమయంలో బాధితురాలిని పరామర్శించడానికి విపక్ష నేత చంద్రబాబు వచ్చారు. ఆయనతో ఆ పార్టీ నాయకుడు బోండా ఉమా తదితరు కూడా ఉన్నారు. దీంతో బాధితురాలి బంధువులు నారా చంద్రబాబునాయుడికి తమ గోడు వెళ్ల బోసుకున్నారు. ఆయన వారిని ఓదార్చిన్యాయం జరిగేలా చూస్తానని చెప్పారు. అదే సందర్భంగా సత్వర న్యాయం చేయాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ కూ చెప్పారు. విపక్ష నేత హోదాలో ఆయన చేసిన పని మహిళా కమిషన్ చైర్ పర్సన్ కు నచ్చలేదు. తనను గౌరవించకుండా బాధితురాలి బంధువులు చంద్రబాబు నాయుడికి గోడు వెళ్ల బుచ్చుకోవడం అస్సలు రుచించలేదు. అయినా తనంత మనిషి ఉండగా తనను కాదని బాధితులు చంద్రబాబును ఎలా ఆశ్రయిస్తారని ఆగ్రహం వచ్చింది. సరే బాథితుల కుటుంబీకులకు తెలియదు...కనీసం చంద్రబాబు అయినా ముందు మహిళా కమిషన్ చైర్ పర్సన్ ను గుర్తించండి అని వారికి చెప్పకపోవడంతో తనేమిటో ఆయనకు తెలియజెప్పాలని భావించారు. అంతే ఇంకే ముందు తన ముందు హాజరు కావాలంటూ చంద్రబాబుకూ, బోండా ఉమాకు నోటీసులు పంపించారు. ఆసుపత్రి వద్ద తనను గౌరవించని కారణంపై విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. విజయవాడ అత్యాచార ఘటన జరిగిన రెండు రోజులకు గానీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ కు బాధితురాలిని పరామర్శించేందుకు సమయం దొరకలేదు. అది కూడా విపక్ష నేత బాధితురాలిని పరామర్శించేందుకు వస్తున్న సమయాన్నే ఆమె ఎ:చుకున్నారు.
సరే ఆమెను గౌరవించలేదంటూ చంద్రబాబు, బోండా ఉమలకు నోటీసులు జారీ చేసిన మహిళా కమిషన్....విజయవాడ గ్యాంగ్ రేప్ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులకు నోటీసులు ఎందుకు జారీ చేయలేదని జనం నిలదీస్తున్నారు. అంతే కాదు రాష్ట్రంలో మహిళలపై జరిగిన అత్యాచార ఘటనల్లో ఏ సందర్భంలోనైనా తమ ఎదుట హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిన దాఖలాలున్నాయా అని ప్రశ్నిస్తున్నారు.
మొత్తం మీద తమపై ప్రజా వ్యతిరేకతకు కూడా విపక్షాలే కారణమంటూ నోటీసులు జారీ చేయడం ద్వారా వాసిరెడ్డి పద్మ ఒక కొత్త సంప్రదాయానికి తెరతీశారని చెప్పవచ్చు. ఇకపై రాష్ట్రంలో బాధితులను పరామర్శించే అధికారం, హక్కు ఒక్క అధికార పార్టీ వారికే ఉందని వైకాపా వాళ్లు చెప్పినా చెప్పొచ్చు.
http://www.teluguone.com/news/content/ap-women-commission-notice-to-chandrababu-39-134816.html





