ప్లేస్ మీరు చెబుతారా.. నన్ను చెప్పమంటారా? .. వైవీకి వైఎస్ షర్మిల సవాల్
posted on Jan 23, 2024 4:34PM
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఇలా బాధ్యతలు చేపడుతూనే అలా అన్న, సీఎం జగన్మోహన్ రెడ్డి మీద, వైసీపి ప్రభుత్వం మీద రాజకీయ యుద్ధం ప్రకటించేశారు. సూటిగా సుత్తి లేకుండా అంశాల వారీగా సహేతుక విమర్శలు సంధించేస్తున్నారు. ఒక్క క్షణం ఆలస్యం లేకుండా జిల్లాల యాత్రకు ఉపక్రమించారు. ఆ సందర్భంగా ఆమె ప్రజలతో మమేకమౌతున్నారు. అధికార పార్టీ పని తీరుపై ప్రశ్నలు వేసి జనం నుంచి సమాధానాలు రాబడుతున్నారు. ఆ సందర్భంగా ప్రజల సమాధానాలు ఆధారంగా మళ్లీ ఏపీ సర్కార్ పై విమర్శలు కురిపిస్తున్నారు.
మంగళవారం (జనవరి 23) శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఆమె పలాస నుంచి ఇచ్చాపురం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రయాణికులను ఏపీలో జగన్ పాలన గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ కష్టాలను వివరిస్తే ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ మీడియాతో మాట్లాడుతూ, తనను తన భాష, జగన్ ను జగన్ రెడ్డిగారూ అని సంబోధించడం నచ్చలేదన్న వైవీ సుబ్బారెడ్డికి నేరుగా సవాల్ విసిరారు. తాను ఇక నుంచి జగన్ రెడ్డిగారూ అని కాకుండా అన్నగారూ అని సంబోధిస్తాననీ, కానీ వైవీ సుబ్బారెడ్డి ఏపీ చాలా అభివృద్ధి చెందిందని కావాలంటే చూపిస్తానని అన్నారు. ఆయన ఆ మాట నిలబెట్టుకోవాలి అన్నారు.
అయితే రాష్ట్రంలో అభివృద్ధి తనకు కనిపించడం లేదనీ, రాజధాని ఎక్కడుంది?మెట్రో రైలు ఎక్కడుంది? పోలవరం పూర్తయ్యిందా? ఇత్యాది విషయాలన్నీ తెలుసుకోవాలని తాను మాత్రమే కాదు, ప్రతిపక్షాలు, మీడియా ప్రతినిథులూ కూడా తహతహలాడుతున్నారన్నారు. కనుక వైవీ సుబ్బారెడ్డిగారి సవాల్ ను స్వీకరిస్తున్నాననీ, ఆయన ఎక్కడకి రమ్మంటే అక్కడికి వస్తాననీ చెప్పారు. అక్కడితో ఆగకుండా ప్లేస్ మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, టైమ్ మీరు చెప్పినా సరే నన్న చెప్పమన్నా సరే అంటూ బాలయ్య డైలాగ్ ను ఇమిటేట్ చేస్తూ సవాల్ విసిరారు.