వైసీపీ అధినేత జగన్‌పై మరో కేసు

 

వైసీపీ అధినేత జగన్‌పై మరో కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నా ఫిబ్రవరి 19న మిర్చి రైతుల పరామర్శ కోసం జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. దీనిపై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. కోడ్ ఉన్నా వైసీపీ నేతలు అనుమతి లేకుండా వచ్చి  నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై జగన్‌తో పాటు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

వీరందరికీ ఇప్పటికే సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. పోలీసులు పిలిచినప్పుడు నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో సూచించారు. కాగా, పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనలోనూ జగన్‌పై కేసు నమోదైన విషయం విదితమే. తాజాగా గుంటూరు మిర్చి యార్డు ఘటనతో ఆయనపై మరో కేసు నమోదైనట్లయింది.