మహిళల్ని అవమానించిన వారు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం : లోకేష్
posted on Jun 7, 2025 4:59PM
.webp)
వైసీపీ అధినేత జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోతారని లోకేష్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలను ఇంత ఘోరంగా మీ మీడియాలో అవమానించవచ్చా? అని ఆయన ప్రశ్నించారు. మహిళల ఆత్మాభిమానం మీద, అమరావతి మీద విద్వేషంతో చేస్తున్న అసత్య ప్రచారం మీ దిగజారుడుతనానికి పరాకాష్ట అని మంత్రి లోకేష్ దుయ్యబట్టారు.
ఆకాశంపై ఉమ్మేయాలనుకుంటే, అది మీ మీదే పడుతుంది. అమరావతిపై విషం చిమ్మాలనుకుంటే అది మీ తాడేపల్లి ప్యాలెస్లో పడుతుందని లోకేష్ పేర్కొన్నారు. అమరావతి ముమ్మాటికీ దేవతల రాజధానే! భూములను త్యాగాలు చేసిన అమ్మల అమరావతి లోకేష్ స్పష్టం చేశారు. మూడు రాజధానుల కపట కుట్ర పొత్తిళ్లలో తంతుంటే, జై అమరావతి అని నినదించిన శాంతమూర్తుల పవిత్ర భూమి మన రాజధాని అని లోకేష్ తెలిపారు. జగన్ అనే సైతాన్ను తరిమేసిన అన్ని మతాల దేవతలు, దేవుళ్లు కొలువైన రాజధాని అమరావతి. కన్నతల్లిని, సొంత చెల్లిని తరిమేసిన దుర్మార్గుడికి మహిళల త్యాగాలు, గొప్పతనం ఏం తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
మహిళల జోలికి వచ్చినా, ఆడపిల్లలను అల్లరి చేసినా, అఘాయిత్యాలకు పాల్పడినా వారికి అదే చివరి రోజు అని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే హెచ్చరిస్తున్నారని అన్నారు. విద్యార్థి దశ నుంచే మహిళలను గౌరవించేలా పాఠాలు బోధిస్తున్నాం. మహిళల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తున్నామని పేర్కొన్నారు. అమరావతిపై విషం చిమ్మేందుకు జన్మనిచ్చిన అమ్మలను, జన్మంతా మనతో నడిచిన మహిళా లోకాన్ని కించపరిచిన జగన్ రెడ్డి గ్యాంగ్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించమని లోకేష్ హెచ్చరించారు.
మహిళలను కించపరిచేలా చీర, గాజులు పెడతాం.. ఆడపిల్లలా ఏడొద్దు, మేమేమి గాజులు తొడుక్కోలేదు.. వంటి మాటలు ఎవ్వరు మాట్లాడినా కూటమి ప్రభుత్వం ఊరుకోదు. రాష్ట్ర మహిళల్ని అవమానపరుస్తూ క్షమించరాని నేరానికి పాల్పడిన జగన్ బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణ కోరాలి. లేకపోతే రాష్ట్రంలో మహిళలని హింసించే మందుల్లేని మహమ్మారితో బాధపడుతున్న జగన్ మాయ రోగం పూర్తిగా నయం చేస్తాం. దేవతల రాజధాని అమరావతి.. దెయ్యం జగన్ పనిపడుతుందని లోకేష్ తెలిపారు.