రామనారాయణంలో వినూత్నంగా యోగాంధ్ర

రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమాల్లో విజయనగరం జిల్లాలో జరిగిన కార్యక్రమం వినూత్నంగా నిలిచింది. పర్యాటక ప్రదేశం అయిన రామనారాయణం లో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో  రామధనస్సు ఆకృతిలో పదిహేను వందలమంది యోగాసనాలు వేయడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. అక్కడివారితో కలసి యోగా చేశారు. 

 ప‌ర్యాట‌క ప్ర‌దేశాల్లో యోగాంధ్ర కార్య‌క్రమాన్ని నిర్వ‌హించాల‌న్న రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యంలో భాగంగా జిల్లాలోని ఆధ్యాత్మిక ప‌ర్యాట‌క కేంద్రం రామ‌నారాయ‌ణంలో శుక్ర‌వారం (మే 30) జిల్లా యంత్రాంగం ఆధ్వ‌ర్యంలో యోగాంధ్ర కార్య‌క్ర‌మాన్ని  నిర్వ‌హించారు. ఈ క్షేత్రంలో కొలువుదీరిన‌ రామ‌నారాయ‌ణుని పాదాల చెంత రామ‌ధ‌నుస్సు ఆకృతిలో రాష్ట్ర మంత్రి  కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్‌, జిల్లా క‌లెక్ట‌ర్ డా.బి.ఆర్‌.అంబేద్క‌ర్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.సేతుమాధ‌వ‌న్ స‌హా సుమారు 1500 మంది ప్ర‌భుత్వ అధికారులు, సిబ్బంది,  ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, ప‌రిస‌ర గ్రామాల ప్ర‌జ‌లు యోగాస‌నాలు వేశారు. ఉద‌యం ఏడుగంటలకే   పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు, యోగ ప‌ట్ల ఆస‌క్తి గ‌ల వారంతా తెల్ల‌ని దుస్తులు ధ‌రించి యోగాంధ్ర కార్య‌క్ర‌మంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయుష్ విభాగం ఆధ్వ‌ర్యంలో యోగ గురువులు డాక్టర్ ఆరిశెట్టి ఇందుమ‌తి,  సుంద‌ర‌శివ‌రావులు కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ అంద‌రితో సుమారు 45 నిముషాల పాటు ప‌లు యోగ‌సనాలు వేయించారు.  

ఈ సంద‌ర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం యోగా ప్రాధాన్య‌త‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసే ఉద్దేశ్యంతో ఈ నెల‌ను యోగా మాసంగా ప్ర‌క‌టించి అన్ని ప్రాంతాల్లో యోగ శిక్ష‌ణ కేంద్రాలు ఏర్పాటు చేసి అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న‌ట్టు చెప్పారు. యోగా మ‌న పూర్వీకులు మ‌నకు అందించిన గొప్ప ఆస్తి అన్నారు. దీనిని సాధ‌న చేయ‌డం ద్వారా   ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షించుకోవ‌చ్చనీ, ఈ దిశగా  ప్ర‌తి ఒక్క‌రినీ ప్రోత్స‌హించ‌డం యోగాంధ్ర ల‌క్ష్య‌మ‌ని చెప్పారు. జూన్ 21న అంత‌ర్జాతీయ దినోత్స‌వంలో పాల్గొనేందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడి విశాఖ వ‌స్తున్నార‌ని ఆరోజున రాష్ట్రమంత‌టా ప్ర‌తి గ్రామంలో యీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డం ద్వారా ప్ర‌పంచానికి యోగా విశిష్ట‌త‌ను తెలియ‌జేసే ఉద్దేశ్యంతో  ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న‌ట్టు పేర్కొన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు నెల‌రోజుల యోగాంధ్ర కార్య‌క్ర‌మంలో భాగంగా జిల్లాలోని నాలుగు ప‌ర్యాట‌క ప్ర‌దేశాల్లో కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నామ‌ని మొద‌ట‌గా రామ‌నారాయ‌ణంలో   ఏర్పాటు చేశామ‌న్నారు. జూన్ నెల‌లో చింత‌ప‌ల్లి బీచ్, రామ‌తీర్ధం, తాటిపూడి రిజ‌ర్వాయ‌రు త‌దిత‌ర ప్ర‌దేశాల్లోనూ యోగాంధ్ర‌లో భాగంగా కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేశామ‌న్నారు.

జూన్ 10వ తేదీన జిల్లాకు చెందిన 5 వేల మంది ఉపాధి ప‌థ‌కం వేత‌న‌దారుల‌తో యోగాస‌నాలు ప్ర‌ద‌ర్శించే కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశామ‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ కోసం జీవితంలో యోగ‌ను భాగంగా చేసుకోవాల‌న్నారు. యోగాస‌నాల ప్ర‌ద‌ర్శ‌న అనంత‌రం కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వారంద‌రికీ రామ‌నారాయ‌ణ ద‌ర్శ‌నాన్ని క‌ల్పించ‌డంతోపాటు తీర్ధ ప్ర‌సాదాల‌ను ఎన్‌.సి.ఎస్‌.ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో అంద‌జేశారు.