ఇంత చెత్త అంపైరింగ్ క్రికెట్లోనే సాధ్యం..సెహ్వాగ్
posted on Aug 6, 2022 2:31PM
ప్రస్తుతం బర్మింగ్ హామ్లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో అంపైరింగ్ లోపాల పట్ల భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మండిపడ్డాడు. గేమ్స్లో మహిళల హాకీ సెమీస్లో ఆసీస్-భారత్ మ్యాచ్ లో అంపైర్లు పక్షపాతంతో వ్యవహరించారని సెహ్వాగ్ ఆరోపించాడు. ఇటువంటివి సహజంగా క్రికెట్లోనే జరుగుతుంటాయి. కానీ ఇపుడు హాకీలో కూడా చూస్తున్నాను అని అన్నాడు. ఇటువంటి పక్షపాతంతో కూడిన అంపైరింగ్ తరచూ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ల్లోని పూర్వం ఎక్కువగా జరుగుతుండేవని వ్యాఖ్యానించాడు.
మహిళల హాకీ సెమీస్లో ఆసీస్ చేతిలో భారత్ ఓడిపోయింది. అయితే ఆ మ్యాచ్లో పెనాల్టీ షూటౌట్ ఇపుడు చర్చనీయాంశంగా మారింది. షూటౌట్ ఆరంభంలోనే గడియారం లోపంతో ఆసీస్ ప్లేయర్ను ముందు పిలిచారు. కానీ ఆంబ్రోసియా మలోన్ గోల్ చేయలేకపోయింది. కానీ గడియారం తప్పుసమయం చేపింది గనుక ఆమెను మళ్లీ అంపైర్ పిలిచాడు. ఒకసారి ఆమె చేసిన ప్రయత్నం విఫలమయింది. కానీ అధికారులు ఆమెను రెండోపర్యాయం పిలవడానికి అనుమతించారు. ఈసారి ఆమె గోల్ చేసింది.
ఆస్ట్రేలియా ప్లేయర్ మొదటి షాట్ మిస్ అయింది, కానీ అంపైర్ క్లాక్ స్టార్ట్కాలేదని ప్రకటించారు. ఇటు వంటి చెత్త అంపైరింగ్ సాధారణంగా క్రికెట్లోనే జరిగేది, అదీ ఆసీస్ జట్టు సూపర్ జట్టుగా ఎదిగే వరకూ జరిగాయని సెహ్వాగ్ గుర్తుచేశాడు. ఇటువంటి చెత్త గేమ్లో ఓడిపోయినప్పటికీ మనవాళ్లు బ్రహ్మాండంగా ఆడారని భారత మహిళా హాకీ టీమ్కు సెహ్వాగ్ ప్రశంసించాడు.
కాగా ఈ సంఘటన గురించి భారత హాకీ మాజీ కెప్టెన్ వీరేన్ రస్కినా స్పందిస్తూ, దీనిపై భారత్ హాకీ సమాఖ్య తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నాడు. అదేమీ అండర్-10 స్కూలు మ్యాచ్ కాదు, ఇలా జరగడం ఈ ఏడాది రెండో పర్యాయం అని అన్నాడు.