యోగాంధ్రతో ప్రపంచం చూపు ఏపీ వైపు.. చంద్రబాబుపై మోడీ ప్రశంసల వర్షం

ప్ర‌పంచ దేశాలను ఏపీ చూడ‌డం కాదు.. ఏపీని ప్ర‌పంచ దేశాలు చూసేలా చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మాట అన్నది ఎవరో కాదు ప్రధాని నరేంద్రమోడీ. శనివారం (జూన్ 21) విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు శుక్రవారం (జూన్ 20) విశాఖ చేరుకున్న ఆయనకు  గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్‌,  ముఖ్యమంత్రి చంద్ర‌బాబు,  ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌ల నుంచి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది.

ఈ సందర్భంగా   సీఎం చంద్ర‌బాబు విశాఖలో అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం నిర్వ‌హ‌ణ‌కు చేసిన ఏర్పాట్లకు సంబంధించిన ఫొటోల‌ను సీఎం చంద్ర‌బాబు ఆయ‌న‌కు చూపించారు. వీటిని తిల‌కించిన ప్ర‌ధాని.. అద్భుతంగా చేశార‌ని.. క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో ఏర్పాట్లు  ఉన్నాయ‌ని అభినందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు యోగాంధ్రపై మోడీకి వివరించారు. నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగా కార్యక్రమాల గురించి తెలిపారు. దీనిపై మోడీ..యోగాను తాను ప్రపంచానికి పరిచయం చేశాననీ, ఆయితే చంద్రబాబు మాత్రం ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేశారనీ ప్రశంసల వర్షం కురిపించారు.