ట్రంప్ సడెన్ గా యుద్ధం ఎందుకు ఆపాడు?
posted on May 12, 2025 5:44AM

అమెరికా అసలు ఉద్దేశం ఏంటి?
భారత్ ఇప్పటికే మూడో అతి పెద్ద ఆర్ధిక శక్తిగా ఎదుగుతోంది. అమెరికా, చైనాలతో పోటీ పడుతోంది. ఇప్పటికే ప్రపంచంలో మరే దేశానికి లేనంత గొప్ప జనాభా శక్తి భారత్ సొంతం. ఈ మార్కెట్ ఒక్కటి చాలు ప్రపంచ వ్యాప్తంగా భారత్ ని అతి పెద్ద ఆర్దిక శక్తి చేయడానికి. చైనాను కూడా మనం క్రాస్ చేసి అతి పెద్ద జనాభా గల దేశంగా మారడం అత్యంత శక్తిమంతమైన దేశంగా ఆవిర్భవింప చేసింది.
అలాంటి భారత్ మరింత ఎదిగి అమెరికా, చైనాలను కూడా ఢీ కొడితే పరిస్థితి మరోలా అవుతుంది. ఇప్పటికే కొన్ని దేశాలు అమెరికాను పెద్దన్న పాత్ర నుంచి పక్కకు తప్పించి భారత్ ను ఆ స్థానంలో చూడాలనుకుంటున్నాయ్. మరీ ముఖ్యంగా ఫ్రెంచ్ అధినేత మక్రాన్ భారత్ నుంచి మోడీ ఆ పాత్ర పోషించాలని కోరుకుంటున్నారు. ఇలాంటి వారు చాలా మందే ఉన్నారు.
అమెరికా ఇప్పటి వరకూ పెద్దన్న పాత్రలో ఉన్నా.. అదంతా వ్యాపార లావాదేవీల్లో భాగమే. ఏ చిన్న అవకాశం దొరికినా అమెరికాకు లాభం చేకూర్చి పెట్టడం ఎలా అన్న కోణంలోనే ఆ దేశ ప్రతి అధ్యక్షుడూ కోరుకుంటారు. అది రష్యా- ఉక్రెయిన్ వార్ అయినా,. సిరియా వార్ అయినా., గల్ఫ్ వార్ అయినా.. దానికి కావాల్సిన వనరుల కోసమే తన ఆరాటమంతా చూపిస్తుంది. అందులో భాగంగానే మొన్న ఉక్రెయిన్ తో అతి పెద్ద ఖనిజ వనరుల ఒప్పందం చేసుకోవడం చూశాం.
భారత్ అలాక్కాదు. దానికలాంటి సమస్యలు కానీ, ఆలోచనలు కానీ లేవు. మనమే పది మందికి అరువు ఇవ్వాలి తప్ప మనమంటూ ఒకరి నుంచి ఏదీ ఆశించకూడదు. యుద్ధాన్ని కోరుకోకూడదు. మనకంటూ భారంగా ఆయుధాలు వాటిపై పెట్టుబడులు కూడా పెద్దగా లేవు. అదే అమెరికాకి అలాక్కాదు.. ఆ దేశ డాలర్ విలువ పడిపోకూడదు. ఆ దేశ టాప్ పొజిషన్ చేజార కూడదు. దానికి తోడు అవసరమున్నా లేకున్నా తయారు చేసి పెట్టుకున్న ఆయుధాలు చాలానే ఉన్నాయ్. వాటి మీద పెట్టిన పెట్టుబడులు భారీగా ఉన్నాయ్. వీటన్నిటి నుంచి రికవరీ కావాలంటే అమెరికా చేయాల్సిన పని.. ప్రపంచంలో ఎక్కడెక్కడ యుద్ధం జరుగుతుందా? ఆ యుద్ధాలకు తమ ఆయుధాలను ఎలా సరఫరా చేయడమా? లేకుంటే నిధులను ఎలా సమకూర్చడమా? వాటి నుంచి పొందాల్సిన లాభం పొందడమా? ఇదే అమెరికా చేసే అతి పెద్ద పని.
మీరు కావాలంటే చూడండి.. ఉక్రెయిన్ రష్యాతో గొడవ పడి పూర్తిగా నాశనమయ్యిందా? ఆ దేశ పునర్నిమాణం పేరు చెప్పి.. ఆ దేశ ఖనిజ నిలువలను అపారంగా తవ్వేసి... వాటి సాయంతో దేశాన్ని తిరిగి నిర్మిస్తామని లింకు పెట్టింది. ఇదే కాదు గల్ఫ్ కంట్రీస్ నుంచి అంతలేసి ఆయిల్ నిల్వలను పొందినా వెంటనే డబ్బులు ఇవ్వదు. ఇవ్వాల్సిన మొత్తాన్ని తన ట్రెజరీలోనే దాచుకుని తద్వారా వారి దేశాన్ని మోడ్రనైజ్ చేస్తుంది. ఇటు ఆ నిల్వలను తన వద్దే దాచుకుంటుంది.
ఇప్పుడు భారత్ విషయానికి వద్దాం. భారత్ కి ఉగ్రవాదం అనే పక్కలో బల్లెం అమెరికాకు అత్యవరసం. ఒక వేళ ఈ యుద్ధం గానీ, కొన్నాళ్ల పాటు జరిగితే అక్కడి ఉగ్ర మూకలు సమూలంగా హతమై పోతాయి. వారు గానీ ఖతమై పోతే.. ఇటు పాక్ పని మాత్రమే కాదు.. అమెరికా ఖేల్ కూడా ఖతమైపోతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఏ సమస్యా లేని దేశంగా భారత్ మారితే ఇక దాని ఎదుగుదలకు అంతుండదు. వెంటనే అంచలంచెలుగా ఎదుగుతుంది. ఎప్పుడైతే భారత్ అలా ఎదుగుతూ పోతుందో.. అప్పుడు.. ఇక భారత్ నెంబర్ వన్ పొజిషన్ కి వచ్చేస్తుంది. ఇప్పటికి గణాంకాల రూపంలో చైనా, అమెరికా ఆర్ధిక శక్తులుగా పోటీ పడుతున్నాయి కానీ.. వాటికంటూ ఉండాల్సిన ఎథికల్ నెంబర్ వన్ పొజిషన్ లేదు. ఎప్పుడూ పరాయి దేశాల మీద పడి దోచుకోవడమే పరమావధి. ఈ విషయంలో చైనా యూఎస్ ఒకదానితో మరొకటి పోటీ పడుతూనే ఉంటాయ్. అదే భారత్ అలాక్కాదు.. సీమ్లా ఒప్పంద కాలంలో తాము స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను సైతం తిరిగి పాక్ కి అప్పగించిన ఉదారత ఈ దేశం సొంతం. అలాంటి భారత్ కి నైతికంగా నెంబర్ వన్ గా ఉండే అర్హత, హక్కులన్నీ ఉన్నాయి.
భారత దేశానికున్న ఒకే ఒక్క ఉగ్ర ముప్పు కూడా తొలిగిపోతే.. పాక్ ప్రస్తుతం ఉన్న స్థితిగతుల నుంచి పూర్తిగా విడుదలై పోతే.. మొదట ఈ పాపిష్టి దేశం పని అయిపోతుంది. తర్వాత భారత్ వెలిగిపోతుంది. ఇప్పటికే ఉగ్రవాదుల్లో సగం ప్రమాదకారులు నశించారు. ఆ మిగిలిన వారి చరిత్ర కూడా ముగిసిపోతే.. ఇక భారత్ కి తిరుగే ఉండదు. తర్వాతి కాలంలో భారత్ కి పట్టపగ్గాలుండవు. ఇది జరగడానికి వీల్లేదన్న భావనతోనే హుటాహుటిన ట్రంప్.. భారత్ , పాక్ లను కాల్పుల విరమణ ఒప్పందానికి ఆగమేఘాల మీద ఒప్పించాడు.
అమెరికా ఉద్దేశంలో ఒకటి ఏదైనా దేశం నుంచి వీలైనంతగా వనరుల దోపిడీ. లేదంటే తన టాప్ పొజిషన్ కి ఢోకా లేకుండా చూసుకోవడం. ఇది ఆ దేశానికి రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి నుంచీ పుట్టుకొచ్చిన అలవాటు. ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. మన దేశానికి స్వాతంత్రకాలం నాటి నుంచి ఉన్న కాశ్మీర్ టూరిజం కోసం పుట్టిన టెర్రరిజం ఎలాగో అమెరికాకు ఈ ఆధిపత్య ధోరణి కూడా సరిగ్గా అలాంటిదే. భారత్ టెర్రరిజం ఫ్రీ కంట్రీ అయిపోతే.. అమెరికా పని అయిపోతుంది. అందుకే ఆ దేశం భారత్ లో టెర్రరిజం ఎప్పటికీ ఉండాలని కోరుకుంటుంది అందుకు అవసరమైన నిధులు ఉగ్రవాద మాతృదేశం పాకిస్తాన్ కి అవసరమైనంత మేర ఇస్తూ.. కాపాడుకొస్తున్నదని అంటారు విదేశాంగ నిపుణులు.