మోదీజీ మాట్లాడరేం?
posted on Sep 18, 2023 10:06AM
విషయం, సందర్భం వేరు కావచ్చు, కానీ, సర్వోన్నత న్యాయస్థానం, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, ఆంధ్ర ప్రదేశ్లో ఏమి జరుగుతోందో మాకు తెలుసు అంటూ చేసిన వ్యాఖ్యలు, రాష్ట్రంలో నెలకొన్న అరాచక పాలన , సాగుతున్న కక్ష సాధింపు చర్యలు, అక్రమ అరెస్టులకు అద్దం పడుతున్నాయి. అవును, ఉద్యోగ సంఘాల నాయకుడు సూర్యనారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీకోర్టు న్యాయమూర్తులు ఏపీలో ఏం జరుగుతోందో మాకు తెలుసు అంటూ వ్యాఖ్యానించారు. అంటే, ఏపీలో ఏమి జరుగుతోందో సుప్రీం కోర్టులు తెలుసు. అయినా నాలుగున్నరేళ్ళ వైసీపీ అరాచక పాలనకు పరాకాష్టగా మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ వ్యవహరం కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? రాష్ట్ర ప్రభుత్వం గీత దాటి ప్రవర్తిస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవలసిన అవసరం లేదా? చంద్రబాబు అక్రమ అరెస్టు విషయంలో, ముఖ్యంగా అరెస్ట్ తీరును, ఉభయ తెలుగు రాష్ర్టాల బీజేపీ నాయకులు సహా పలువురు రాజకీయేతర రంగాల ప్రముఖులు, ఖండించారు. ఖండిస్తున్నారు. కేవలం ఖండించడమే కాకుండా, దేశ,విదేశాల్లో చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా యువత, ఐటీ ఉద్యోగులు, మహిళలు ఆందోళనలు చేస్తున్నారు. రోజు రోజుకు పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది.. అయినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించదు. ఎందుకు కళ్ళు తెరవదు? ఇది రాష్ట్ర ప్రజానీకాన్ని వేధిస్తున్న ప్రశ్న.
చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడమే కాదు ... పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సహా తెలుగు దేశం ముఖ్య నేతలు అందరినీ అరెస్ట్ చేస్తామని మంత్రులు బహిరంగంగానే బెదిరింపులకు దిగడం ఏమిటని? ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు పెదవి విప్పడం లేదని నిలదీస్తున్నారు. మధన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు అందరి వేదనకు అద్దం పడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశారు.
ఈ లేఖలో పలు ప్రశ్నలు సంధించారు. మీకు తెలియకుండానే చంద్రబాబును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేయించిందా? అని ప్రశ్నించారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. ఆ లేఖలో.. మీరు జీ20 శిఖరాగ్ర సదస్సులో హడావుడిగా ఉన్నప్పుడు.. సీఎం జగన్ లండన్లో ఉన్నప్పుడు ఈ అరెస్ట్ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా సాగుతున్న రాజకీయ కక్షలు, స్కాములు, అక్రమ కేసులు, అభద్రతాభావం, దిగజారుతున్న శాంతిభద్రతలు.. ఇవన్నీ చూసి రాష్ట్ర ప్రజల తరపున బాధతో.. బాధ్యతతో అడుగుతున్నా.. చంద్రబాబును నిరాధార ఆరోపణలతో జైల్లో పెట్టడం చూసి నా హృదయం రగిలిపోయింది అని కేఎస్ రామారావు పేర్కొన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని.. కానీ రాష్ట్ర పౌరుడిగా, భారత పౌరుడిగా ఏపీలో ప్రస్తుత పరిస్థితుల్ని చూసి బాగా విసిగిపోయానని పేర్కొన్నారు. రాజధాని లేని రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక భావితరాల కోసం రాజధానిగా అమరావతిని ప్రకటించారు. శంకుస్థాపనకు ప్రధాని హోదాలో మీరూ వచ్చారు. ఆ సమయంలో చంద్రబాబు విజన్ ను పొగిడారు. అమరావతి ప్రపంచానికే ఆదర్శవంతమైన రాజధాని అవుతుందని అన్నారని కేఎస్ రామారావు ఆ లేఖలో గుర్తు చేశారు.
ఆ తర్వాత 16 నెలలు జైల్లో గడిపి, ఆర్థిక మోసాల కేసులో నిందితుడిగా ఉన్న జగన్ అధికారంలోకి వచ్చాక ముందుగా ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసక పాలన ఆరంభించారు, అమరావతిని రాజధానిగా ఉండనివ్వకూడదని ప్రకటించి.. మూడు రాజధానులంటూ ఒక పల్లవి ఎత్తుకుని.. అమరావతిని నిర్వీర్యం చేసేశారు. ప్రధానిగా మీరు (మోడీ) శంకుస్థాపన చేసిన రాజధాని విషయంలో జగన్ తీరును మీరు ఇప్పటికీ ఖండించలేదు. మౌనాన్ని ఆశ్రయించారు. అలాగే దేశంలో ఐటీ రంగానికి ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబు వల్లే ఇప్పుడు లక్షల మంది ఉద్యోగులు ప్రపంచ వ్యాప్తంగా మంచి జీవితాలు అనుభవిస్తున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న ఐటీ ఉద్యోగులను చంద్రబాబు అరెస్ట్ వార్త కుదిపేసింది. రోడ్ల మీదకు వచ్చి వారు తెలిపిన నిరసనను.. ప్రధానమంత్రిగా మీరు గమనించలేదా అని ప్రశ్నించారు.
నేషనల్ ఫ్రంట్కు ఎన్టీ రామారావు ఛైర్మన్గా ఉన్నప్పుడు బీజేపీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు చేసిన కృషి ఏమిటో మీకు తెలియదా? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతను జైల్లో ఇబ్బందులు పెడుతుంటే.. తెలుగు ప్రజల హృదయాల్లో రగులుతున్న బడబాగ్నిని మీరెందుకు గమనించలేకపోతున్నారు. లేక రాజకీయ లబ్ధి వినా ప్రధానిగా మీరింకే విషయాన్నీ పట్టించుకోరా అని నిలదీశారు. ఇప్పటికైనా చంద్రబాబును జైలు నుంచి విడుదల చేయించండి అని కేఎస్ రామారావు తన లేఖలో ప్రధానిని కోరారు. అంతేగాక, ప్రధానమంత్రిగా మీకున్న అధికారంతో జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేయండి. రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు జరిగేవరకూ రాష్ట్రపతి పాలన విధించండి. ఆ చర్యతో తెలుగు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. తక్షణం స్పందించి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించండి అని తన లేఖలో ప్రధాని మోడీని కేఎస్ రామారావు కోరారు.
నిజానికి, సినీ నిర్మాత కేఎస్ రామారావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖపై ఆయన సంతకం ఒక్కటే ఉన్నా .. అది ఐదు కోట్ల ఆంధ్రుల సంతకమేనని చెప్పాలి. ఐదు కోట్ల ఆంధ్రుల హృదయస్పందనకు కేఎస్ రామారావు లేఖను దర్పణంగా చూడాలి. నిజానికి కేఎస్ రామారావు సంతకం చేసిన లేఖ ఆంధ్రులు, ఇరుగు పొరుగు రాష్ట్రాల తెలుగు వారిదే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరి హస్తాక్షరి ... ఆ ఒక్క సంతకం. అందుకే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు అక్రమ అరెస్టు విషయంలో జోక్యం చేసుకోవలసిన అవసరం వుంది , ప్రాజస్వామ్యం మరింత పలచనై, ప్రజల విశ్వాసాన్ని మరింతగా కోల్పోతుందని, ప్రజస్వామ్య పరిరక్షణ వేదికలు హెచ్చరిస్తున్నాయి.