భారత్- పాక్ కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఎంత?
posted on May 12, 2025 2:03PM

అణుముప్పు మేటరేంటి?
భారత్- పాక్ మధ్య ఆకస్మిక కాల్పుల విరమణ విషయంలో అసలేం జరిగింది? ఎందుకని ఈ రెండు దేశాలు సడెన్ గా ఈ డెసిషన్ తీసుకున్నాయి? ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతలు పెచ్చరిల్లిన కారణంగానే కాల్పుల విరమణ ప్రకటన చేశాయా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇక్కడే కొన్ని ఊహాగానాలు ఊపందుకున్నాయి. వాటి సారం ఎలా ఉందో చూస్తే..
1. ఆకస్మికంగా ఉద్రిక్తత పెరగడం
2. భారత రక్షణ కార్యదర్శి ప్రకటన వెలువడటం
3. అంతర్జాతీయ ప్రతిచర్యలు, హెచ్చరికలు జారీ కావడం
4. అణ్వాయుధ ముప్పు కనిపించడం
5. భౌగోళిక రాజకీయ ఒత్తిడి రావడం
6. యునైటెడ్ స్టేట్స్ పాత్ర పెరగడం
7. భద్రతా సమన్వయ సమావేశం ద్వారా నిర్ణయం
ఈ ఏడింటిలో ఏది ఈ కాల్పుల విరమణకు ప్రధాన పాత్ర పోషించి ఉంటుందన్నది ఒక చర్చ కాగా.. మే పదో తేదీన జరిగిన ఆ 90 నిమిషాల దాడి కీలకంగా భావిస్తున్నారు. అదే అణు దాడి. ఈ మొత్తం పాయింట్లలో నాలుగో పాయింట్ అణ్వాయుధ ముప్పు, ఆపై ఆరో పాయింట్లోని యునైటెడ్ స్టేట్స్ పాత్ర అత్యంత కీలకంగా పరిగణిస్తున్నారు.
ఏంటీ రెండు పాయింట్ల ద్వారా మనకు తెలిసే నీతి అని చూస్తే.. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. అమెరికా పాకిస్తాన్కు ఇచ్చిన అత్యాధునిక ఎఫ్-16 యుద్ధ విమానాలు ఉంచిన సర్గోధ వైమానిక స్థావరం కూడా భారత దాడుల ధాటికి నేలమట్టమైంది. అంతే కాదు, సర్గోధ సమీపంలోని కార్నీ పర్వతాలలో పాకిస్తాన్ రహస్యంగా దాచిన అణ్వాయుధాలపై కూడా భారత్ దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
మధ్యాహ్నం వరకు కొనసాగిన దాడుల తర్వాత, పాకిస్తాన్ తమ దగ్గర మందుగుండు సామాగ్రి అయిపోయిందనీ.. కేవలం అణ్వాయుధాలు మాత్రమే మిగిలాయని అమెరికాకు సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది. కానీ, భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సర్గోధ సమీపంలోని కార్నీ పర్వతాలపై బాంబుల వర్షం కురిపించినట్టు చెబుతున్నారు.
ఈ ఆరు సొరంగాల ప్రవేశ ద్వారాల వద్ద జరిగిన పేలుళ్ల వల్ల లోపల ఉన్న అణ్వాయుధాలు వేడికి ధ్వంసమై ఉండవచ్చని భావిస్తున్నారు నిపుణులు. ఈ దాడుల కారణంగా 4.0 తీవ్రతతో భూ కంపం సంభవించినట్టు కూడా వార్తలు వచ్చాయి. అంతకుముందు చెఘాయి హిల్స్ ప్రాంతంలో కూడా ఇదే తీవ్రతతో భూ కంపం రావడం పలు అనుమానాలకు దారి తీసింది.
భారతదేశం చెఘాయి హిల్స్పై దాడి చేయడంతో అమెరికా ఒక్క సారిగా ఉలిక్కిపడింది. అణ్వాయుధ యుద్ధం తప్పదనే భయం ఒకవైపు, తమ ఆయుధాలు ఇలా పేలిపోతుంటే ప్రపంచవ్యాప్తంగా తమ ఆయుధ మార్కెట్ పడి పోతుందనే ఆందోళన మరోవైపు అమెరికాను కలవరపాటుకు గురిచేసినట్టు తెలుస్తోంది.
దీంతో హుటాహుటిన అమెరికా రంగంలోకి దిగి.. కాల్పులను ఆపడానికి ప్రయత్నించిందని సమాచారం. అదే సమయంలో, భారత్ బలూచిస్తాన్లోని బోలారి వైమానిక స్థావరంపైనా క్షిపణి దాడి చేసింది. ఈ దాడుల్లో భారతీయ యుద్ధ విమానాలు పాల్గొనలేదు, కేవలం ఖచ్చితత్వంతో కూడిన క్షిపణి దాడులు మాత్రమే జరిగాయి.
ఈ దాడుల్లో పాకిస్తాన్కు చెందిన 40 మంది వరకూ సైనికులు మరణించినట్టు చెబుతున్నారు మన అధికారులు. పాకిస్తాన్ కూడా స్వయంగా ఈ విషయం అంగీకరించింది. అంతే కాదు, పాకిస్తాన్ హెచ్చరిక వ్యవస్థగా పనిచేసే అమెరికన్ ఎవాక్స్ విమానాలు కూడా దాడుల్లో దెబ్బ తిన్నట్టు తెలుస్తోంది.
మొత్తం మీద అమెరికన్ ఆయుధాల విశ్వసనీయత ప్రశ్నార్థం కావడమే అత్యంత కీలకంగా భావిస్తున్నారు. భారతదేశం ఎవరి సహాయం లేకుండా, కేవలం తన స్వశక్తితో ఈ దాడులను విజయ వంతంగా నిర్వహించడం ద్వారా ప్రపంచ దేశాలకు ఒక బలమైన సందేశాన్ని ఇచ్చినట్టయ్యింది. దీంతో అమెరికా తన ఆయుధ మార్కెట్ను కాపాడుకోవడానికి, అణ్వాయుధ యుద్ధాన్ని నివారించడానికి తీవ్రయత్నాలుసాగించినట్టు తెలుస్తోంది.
ఇందువల్లే అమెరికా ఈ చర్చల కోసం భారత్ పై ఒత్తిడి తెచ్చి ఉండొచ్చని అంటున్నారు. అయితే అమెరికా నేరుగా సంప్రదించక ముందే పాక్ డీజీ, భారత్ తో మాట్లాడారు. ఆ తర్వాత భారత్ సైతం చర్చలకు సిద్ధమైంది. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విజయం తన ఖాతాలో వేస్కునే యత్నం చేశారు.
అయితే మోడీ మాత్రం కశ్మీర్ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని.. పీవోకే స్వాధీనం, ఉగ్రవాదుల అప్పగింతలో మాత్రమే చర్చలు అవసరమవుతాయని స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ సిందూర్ ఇక్కడితో ముగియలేదని కూడా అన్నారు. మరి చూడాలి తదనంతర పరిణామ క్రమాలు ఎలా ఉండనున్నాయో?