ట్వీట్ తో బుక్కైన విజయసాయి.. ఫేక్ రెడ్డి అంటూ నెటిజన్ల ట్రోలింగ్  

విజయసాయి రెడ్డి... వైసీపీ రాజ్యసభ సభ్యుడు.. జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2గా జైలుకు వెళ్లారు విజయసాయి రెడ్డి. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే నెంబర్ 2 ఆయనే అని టాక్. విశాఖ అడ్డాగా రాజకీయాలు చేస్తున్న సాయి రెడ్డి.. నిత్యం ట్విట్టర్ లో ఏదో ఒక పోస్టు పెడుతుంటారు. సీఎం జగన్ రెడ్డిని, వైసీపీ ప్రభుత్వాన్ని పొగుడుతూనే, టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ ను టార్గెట్ చేస్తూనే ఆ ట్వీట్లు ఉంటాయి. అయితే విజయసాయి చేసే ట్వీట్లలో అన్ని అసత్యాలు, అబద్దాలు ఉంటాయనే విమర్శలు ఉన్నాయి. చాలా సార్లు తప్పుడు ట్వీట్లు చేసి ఆయన బుక్కయ్యారు. అందుకే విపక్ష నేతలు ఆయన్ను ఫేక్ రెడ్డి అని విమర్శిస్తూ ఉంటారు.

తాజాగా మరోసారి ఫేక్ ట్వీట్ తో  అడ్డంగా బుక్కైపోయారు విజయసాయి రెడ్డి. కొవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించి ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీలో తెగ వైరల్ అవుతోంది. ఆయనపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ఇంతకు విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ వైరల్ కావడానికి కారణం ఏంటో తెలుసా... తెలంగాణలో కొవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించిన ఫోటోలను ఏపీలోనివి చెబుతూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేయడమే. హెల్త్ వర్కర్లు మారు మూల ప్రాంతాలకు, వ్యవసాయ క్షేత్రాలకు దగ్గరకు వెళ్లి కూలీలకు టీకాలు వేస్తున్న ఫోటలవి. ఇక్కడే మరీ సిల్లీగా బుక్కైపోయారు సాయి రెడ్డి. 

సెప్టెంబర్ 21న కొవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించి ఈ ట్వీట్ చేశారు విజయసాయి రెడ్డి. విజయనగరం జిల్లా, ప్రకాశం జిల్లాకు సంబంధించిన కొవిడ్ వ్యాక్సినేషన్ ఫోటోలుగా చెబుతూ.. సీఎం జగన్ ను ఆకాశానికెత్తుతూ ఆయన ట్వీట్ చేశారు. సాయి రెడ్డి ట్వీట్ చూసిన వారు ఇదంతా  నిజమే అనుకున్నారు. ఏపీలో వ్యాక్సినేషన్ అద్భుతంగా సాగుతుందని భావించారు. కాని అసలు సంగతి తర్వాత బయటపడింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇవే ఫోటోలతో గురువారం ట్వీట్ చేశారు. కొవిడ్ వ్యాక్సినేషన్ లో భాగంగా హెల్త్ వర్కర్లు బాగా కష్టపడుతున్నారంటూ... నర్సులు మారుమూల ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల దగ్గర కూలీలకు టీకాలు వేస్తున్న ఫోటోలను ఆయన ట్వీట్ చేశారు. ఖమ్మం, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు సంబంధించిన కొవిడ్ వ్యాక్సినేషన్ ఫోటోలంటూ ఆయన కామెంట్ చేశారు. 

 

అయితే కేటీఆర్ ట్వీట్ చేసిన ఫోటోలు.. రెండు రోజుల ముందు విజయసాయి రెడ్డి చేసిన ఫోటోలు సేమ్. దీంతో ఇంతకు ఈ ఫోటోలు ఎక్కడవన్నది చర్చగా మారింది. దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలించగా.. కేటీఆర్ ట్వీట్ చేసిన ఫోటోలకు సంబంధించిన వివరాలు లోకల్ పేపర్లలో వచ్చాయి. కాని విజయసాయి రెడ్డి చెబుతున్నట్లు ప్రకాశం, విజయనగరం జిల్లాలో ఎలాంటి సమాచారం లేదు. దీంతో విజయసాయి రెడ్డి ఫేక్ బండారం భయటపడింది. తెలంగాణలో జరిగిన వ్యాక్సినేషన్ కు సంబంధించిన ఫోటోలను విజయసాయి రెడ్డి.. ఏపీలో జరిగినట్లుగా తప్పుడు ట్వీట్ చేశారన్నది స్పష్టమైంది. 

విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆయనను నెటిజన్లు ఆటాడుకుంటున్నారు. తెలంగాణ జిల్లాలు ఏపీలో ఎప్పుడు కలిపారంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. రెడ్డి గారి పక్క రాష్ట్రం ఫోటోలతో భలే ఫోజులు కొడుతున్నారంటూ మరికొందరు కామెంట్ చేశారు. ఇంత పచ్చిగా అబద్దాలు ప్రచారం చేసుకుంటారా అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నించారు. ఫేక్ రెడ్డి బండారం మరోసారి బయటపడిందని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. విజయసాయి రెడ్డి బండారం భయటపడటంతో టీడీపీ సహా విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఇంకెంత కాలం ఫేక్ బతుకులంటూ మండిపడుతున్నాయి.