బాబుదే జయం.. ఇది ఖాయం!
posted on Sep 26, 2023 9:16AM
స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన క్షణం నుంచీ వైసీపీ శ్రేణులు ఆత్మరక్షణలో పడ్డాయి. అరెస్టు సక్రమమని చెప్పలేక, తమ అధినేతను ధిక్కరించే ధైర్యం చేయలేక గింజుకుంటున్నాయి. అంతే కాకుండా ప్రస్తుతం జగన్ కు పార్టీ నేతలు, కార్యకర్తలూ అవసరం లేదనీ, వారి పని ఘనత వహించిన పోలీసు అధికారులే చేసేస్తున్నారనీ అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తూ, తమ భవిష్యత్ పై బెంగటిల్లుతున్నారు.
ఇప్పటి వరకూ రాజకీయాలలో ఇటువంటి కక్ష సాధింపు తీరును ఎన్నడూ చూడలేదని అంటున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో అవినీతి జరిగిందని నమ్మించేందుకు సర్కార్ ఎంతగా గొబెల్స్ ప్రచారం చేస్తున్నా సొంత పార్టీ క్యాడరే ఆ విషయాన్ని నమ్మలేకపోతున్నారు. అదే సమయంలో అదే స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పుణ్యమా అని తమ పిల్లలు బాగుపడ్డారనీ, మంచి ఉద్యోగాలలో సెటిలయ్యారనీ వైసీపీ క్యాడరే అంటోంది. అన్నిటికీ మించి గత పక్షం రోజులుగా కేసు తీరు తెన్నులను, సీఐడీ చీఫ్ పత్రికా సమావేశాలను గమనిస్తున్న వారంతా రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారనే అంటున్నారు.
క్షేత్ర స్థాయిలో ప్రజాభిప్రాయాన్ని, ప్రజాగ్రహాన్ని ప్రత్యక్షంగా చూసిన, చూస్తున్న నేతలైతే.. వచ్చే ఎన్నికలలో ప్రజల ముందుకు వెళ్లడం అసాధ్యమని బాహాటంగానే చెబుతున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసి ముఖ్యమంత్రి పార్టీ పాలిట, తమ పాలిట భస్మాసురుడుగా మారారనీ, ఆయనతో తమకు కూడా రాజకీయంగా మరణశాసనం రాసేశారనీ చెబుతున్నారు. చంద్రబాబును అరెస్టు చేసి జైలులో పెడితే.. అది ఎంత అక్రమంగానైనా సరే.. తెలుగుదేశం పార్టీ కుదేలౌతుందనీ, ఆ పార్టీ ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు అవసరమైన దిశ, దశ అందిచే నాయకుడు దూరమై నిస్తేజమైపోతుందనీ జగన్ ఊహించారనీ, అయితే ఆయనే కాదు.. అసలు ఎవరూ ఊహించనంత తీవ్రంగా ఆయన అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఆందోళనలతో జగన్ రెడ్డి, ఆయన పార్టీయే ఏం చేయాలో తెలియని అయోమయస్థితిలో, ఏం చేసినా ఇక లాభం లేదన్న నిస్తేజంలో మునిగిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రోటిలో తలపెట్టేశాం.. ఎన్నికలలో రోకటి పోటు తినాల్సిందే అన్న నిశ్చితాభిప్రాయానికి వైసీపీ నేతలూ, క్యాడర్ వచ్చేశారని అంటున్నారు.
ఈ నేపధ్యంలోనే 2019 ఎన్నికల్లో, ఒక్క ఛాన్స్ వ్యూహంతో వైసీపీని గెలిపించిన, ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్’కిశోర్ సైతం చంద్రబాబు అరెస్ట్ తరువాత జగన్ని తప్పు చేశావ్ అని హెచ్చరించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు అరెస్టుకు ముందే జగన్ కు నో అనదర్ చాన్స్ అన్న నిర్ణయానికి వచ్చేసిన ఏపీ ప్రజలు.. ఇక ఇప్పుడు జగన్ ను ఓడించేందుకు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్న పరిస్థితి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా, చంద్రబాబు అప్పటికీ రిమాండ్ లోనే తెలుగుదేశం పార్టీని గెలిపించుకునేందుకు తెగించి బయటకు వస్తామని జనం స్వచ్చందంగా చెబుతున్నారు.
ఈ విషయం తాజా సీఓటర్ సర్వే పేర్కొంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా విజయం తెలుగుదేశం పార్టీదేనని ఆ సర్వే పేర్కంది. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను స్పందిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఆర్థిక, రాజకీయ, సినీ పరిశ్రమలకు చెందిన వారు స్వచ్ఛందంగా చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ.. జగన్ సర్కార్ తీరును ఖండిస్తున్నారు. ప్రాంతీయ, భాషా బేధాలకు అతీతంగా అన్ని వైపుల నుంచీ, అన్ని వర్గాల నుంచీ చంద్రబాబుకు సంఘీభావం వ్యక్తం అవుతున్నది.