యూపీ ఎన్నికలు.. స్మార్ట్ఫోన్ ఆఫర్...
posted on Sep 6, 2016 12:41PM

ఎన్నికలు వస్తున్నాయంటే చాలు రాజకీయ నేతలు ప్రజలను ఎలా ప్రసన్నం చేయాలో అని వ్యూహాలు పన్నుతుంటారు. తమ తమ మేనిఫెస్టోలో కొత్త కొత్త హామీలను చేర్చుతారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల పథకాలను ప్రవేశపెడతారు. ఇప్పుడు యూపీ ప్రభుత్వం కూడా అలాంటి పథకమే ఒకటి తెరపైకి తీసుకొచ్చింది. ‘సమాజ్వాది స్మార్ట్ఫోన్ యోజన’ పథకాన్ని. ఇదేం పథకం అనుకుంటున్నారా.. అదేంటంటే.. ఈపథకం ద్వారా అధునాతన ఫీచర్లు ఉన్న స్మార్ట్ఫోన్లను అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వం యూపీ ప్రజలకు అందించనున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా... ప్రజలు ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి తెలుసుకుంటారట. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కోసం..ఉత్తరప్రదేశ్లో నివసిస్తూ 18 సంవత్సరాలు నిండిన ఎవరైన ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబం ఆదాయం సంవత్సరానికి రెండు లక్షల రూపాయల లోపు ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడే ఇచ్చేయరు. వచ్చే ఏడాది యూపీ ఎన్నికలు రెండో భాగంలో పంపిణీ చేస్తారంట. అప్పటికీ ఎన్నికలు కూడా ముగిసిపోతాయి. ఈలోపు గెలిచేదెవరో.. ఓడేదెవరో.. కానీ ప్రజలను తమవైపు తిప్పుకోవడానికి మంచి ప్లాన్ వేశారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..