స్నేహ‌మే జీవితం.. దూర‌మ‌వ‌డంతో ముగ్గురి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం..

గంగజల, మల్లిక, వందన. ముగ్గురూ ప్రాణ స్నేహితులు. ద‌గ్గ‌రి బంధువులు. ఒకే ఊరు. ఒకే వాడ‌. చిన్న‌ప్ప‌టి నుంచీ క‌లిసిమెలిసి పెరిగారు. తిరిగారు. ఆడారు. పాడారు. చ‌దువుకున్నారు. ఆ ముగ్గురూ వేరు వేరు కాదు.. ఒక్క‌రే అనేలా జీవించారు. అలా 19ఏళ్లు గ‌డిచాయి. పెళ్లీడుకు రావ‌డంతో రెండు నెల‌ల క్రితం ప‌రిస్థితి మారిపోయింది. తాజాగా వారి స్నేహ జీవితం విషాదాంతమవ‌డం జ‌గిత్యాల‌లో క‌ల‌క‌లంగా మారింది.   

ఇటీవలే ఆ ముగ్గురిలో గంగజల, మల్లికల‌కు పెళ్లి చేశారు ఇంట్లోవాళ్లు. ఆగ‌స్టులో మూడు రోజుల గ్యాప్‌లోనే వాళ్లిద్ద‌రి వివాహం జ‌రిగింది. రెండు నెల‌లు గ‌డిచాయి. ఈ రెండు నెల‌లు ఆ ఇద్ద‌రూ అత్తారింట్లో ఉండ‌టం.. ఆ ముగ్గురూ ఒక‌రినొక‌రు క‌లుసుకోకుండా ఉండ‌టం వాళ్లు త‌ట్టుకోలేక‌పోయారు. ఒక‌రు లేకుండా ఇంకొక‌రు ఉండ‌లేక‌పోయారు. క‌ట్ చేస్తే.. ఆ ముగ్గురూ చెరువులో శ‌వ‌మై తేల‌డం విషాదం. 

పెళ్లయిన ఇద్దరు యువతులు వారం క్రితమే పుట్టింటికి వచ్చారు. ఏం జరిగిందో ఏమో.. బుధ‌వారం మ‌ధ్యాహ్నం రెండున్న‌ర ప్రాంతంలో ఆ ముగ్గురూ ఇళ్లలోంచి వెళ్లారు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. చుట్టుపక్కల గాలించినా ఆచూకీ దొర‌క‌లేదు. గురువారం ఉదయం ధర్మసముద్రం రిజర్వాయర్‌లో మృతదేహాలు బయటపడ్డాయి. ఆ ముగ్గురూ క‌లిసి ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని తెలుస్తోంది. 

‘అనారోగ్యం కారణంగానే తమ కుమార్తెలు బలవన్మరణానికి పాల్పడ్డారని’ గంగ‌జ‌ల‌, మ‌ల్లిక‌ల‌ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె వారిద్దరితో కలిసి ఆత్మహత్య చేసుకుందని వందన తండ్రి కంప్లైంట్ ఇచ్చారు. ఆ ముగ్గురి సెల్‌ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. పెళ్లి కావ‌డంతో ఒకరికొకరం దూరమయ్యామనే బాధతోనే వారు ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. ఇలా 19 ఏళ్ల‌ వారి స్నేహం..జీవితం.. ఒక్క‌సారిగా విషాదాంతం అవ‌డం గురించి తెలిసిన వారంతా క‌లత చెందుతున్నారు. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu