తీరాన్ని తాకిన 'థానే' తుఫాను

చెన్నై: తమిళనాడు, దక్షిణ ఆంధ్ర ప్రదేశ్‌ కోస్తా తీరాన్ని అతలాకుతలం చేసిన థానే తుపాను ఈ తెల్లవారుజామున పుదుచ్చేరి, తమిళనాడులోని కడలూరు మధ్య తీరాన్ని తాకింది. ఇది పూర్తిగా తీరాన్ని దాటేందుకు మరికొంత సమయం పడుతుందని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో పుదుచ్చేరి, తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు సుమారు 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. పెద్ద పెద్ద చెట్లు నేలకూలాయి. విద్యుత్‌ వ్యవస్థ చాలా చోట్ల దెబ్బతింది. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత కేంద్రాలకు తరలిస్తున్నారు. తీర ప్రాంతాల్లోని స్కూళ్లు, విద్యాసంస్థలకు తమిళనాడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోనూ తుపాను ప్రభావం కనిపిస్తోంది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. రాష్ట్రంలోని ప్రధాన ఓడరేవుల్లో మూడో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నెల్లూరు జిల్లా తడ మండలం వేనాడు, ఇరక్కం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఊళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu