తిరుపతి వస్తే మీ సంగతి చూస్తా.. గ్రామస్తులకు చెవిరెడ్డి వార్నింగ్

 

చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు పోలింగ్ బూత్ ల్లో రీపోలింగ్ కు ఈసీ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఐదు ప్రాంతాలు టీడీపీకి గట్టి పట్టున్న ప్రాంతాలు కావడంతో అక్కడ వైసీపీ నేతల ప్రవేశానికి స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి రీపోలింగ్ జరిగే వెంకటరామాపురం గ్రామానికి వెళ్లి ప్రచారం చేసేందుకు ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన చెవిరెడ్డిని గ్రామస్థులు అడ్డుకున్నారు. తమ ఊళ్లోకి రానివ్వబోమని తేల్చిచెప్పారు. ఈ పరిణామంతో కంగుతున్న చెవిరెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. 'తిరుపతికి వస్తారుగా, అక్కడ చూసుకుంటా మీ సంగతి' అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. చెవిరెడ్డి గ్రామంలో కాలినడకన తిరుగుతున్నంత సేపు అడుగడుగునా గ్రామస్థలు అడ్డుకున్నారు. మహిళలు చెవిరెడ్డిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు భారీగా మోహరించి చెవిరెడ్డికి రక్షణగా నిలిచారు.

ఈ ఉదయం ఎన్ఆర్ కమ్మపల్లెలోనూ చెవిరెడ్డికి ఇదే తరహా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ప్రశాంతంగా పోలింగ్ జరిగిన తమ గ్రామాల్లో రీపోలింగ్ ఎందుకు నిర్వహిస్తున్నారంటూ గ్రామస్థులు నిలదీస్తున్నారు. చెవిరెడ్డి ఫిర్యాదు మేరకే ఈసీ రీపోలింగ్ కు ప్రకటన చేసిందన్న వార్తల నేపథ్యంలో వారు ఆయనపై విరుచుకుపడుతున్నారు.