హస్తినలో కూల్చివేతలు.. ఉద్రిక్తత
posted on Jan 7, 2026 8:38AM

దేశ రాజధాని నగరంలో కూల్చివేతలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. పాత ఢిల్లీలోని టర్క్ మాన్ గేట్ సమీపంలోని ఫైజ్-ఏ-ఇలాహీ మసీదు సమీపంలోని ఆక్రమణలను తొలగించేందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన కూల్చివేతల పట్ల స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆక్రమణల తొలగింపు కోసం ఢిల్లీ మునిసిపల్ కార్పొరేష్ బుధవారం (జనవరి 7) తెల్లవారు జామున కూల్చివేతల డ్రైవ్ చేపట్టింది. ఈ కూల్చివేతలను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. కూల్చివేతల ప్రాంతంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకుని వచ్చి మరీ పోలీసులపై రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అయినా పరిస్థితి అదుపులోనికి రాకపోవడంతో బాష్ఫవాయువు ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు.
ఫైజ్-ఏ-ఇలాహీ మసీదు, శ్మశాన వాటికకు ఆనుకుని ఉన్న 38 వేల 940 చదరపు అడుగుల భూమిలో అక్రమ కట్టడాలను తొలగించాలని ఢిల్లీ హైకోర్టు గత ఏడాది నవంబర్లో ఆదేశాలు జారీ చేసింది. దీనిపై మసీదు కమిటీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కోర్టు స్టే ఇవ్వకపోవడంతో అధికారులు భారీగా పోలీసులు మోహరించి 17 బుల్డోజర్లతో కూల్చివేతల చేపట్టారు.