చిక్కుల్లో రఘురామ.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ సిట్ నోటీసులు

 వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజుకు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ సిట్ నోటీసులు జారీ చేసింది. దీంతో రఘురామ రాజుకు దెబ్బ మీద దెబ్బ  తగులుతోందని చెప్పక తప్పదు.  గతంలో ఏపీ సీఐడీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడమే కాకుండా ఆయన అరికాళ్ల మీద విపరీతంగా కొట్టారంటూ వచ్చిన ఆరోపణలు గత ఏడాది పెను సంచలనం సృష్టించాయి.  తాజాగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణకు హాజరు కావాలంటూ రఘురామకు తెలంగాణ సిట్ అధికారులు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29న బంజారాహిల్స్ లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సిట్ ఆ నోటీసులలో పేర్కొంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు వంద కోట్ల రూపాయలు సమకూరుస్తున్నాను అని రఘురామ అన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రఘురామను విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు ఇచ్చింది. దీంతో మరోసారి రఘురామకృష్ణరాజు మరోసారి వార్తల్లోకి వచ్చారు.

గత ఏడాది మే 14న ఏపీ సీఐడీ అధికారులు రఘురామను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా రఘురామ వ్యవహరించారనే అభియోగంతో ఆయనను అరెస్ట్ చేశారు. రఘురామపై 124 ఏ, 153 బీ, 505 ఐపీసీ, 120 బీ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇతరుల మధ్య విద్వేషాలు కలిగించేలా వ్యాఖ్యలు చేశారని, ఉన్నత పదవుల్లో ఉన్న వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రాజద్రోహం సహా పలు కేసులు పెట్టారు.  అయితే.. తనను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు తీవ్రంగా కొట్టారని రఘురామ ఆరోపించడం తీవ్ర సంచలనంగా మారింది.  పోలీసుల దెబ్బలతో తన కాళ్లు వాచిపోయాయని చెప్పడంతో గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించి, ఆయన శరీరంపై గాయాలు లేవని హైకోర్టుకు చెప్పారు.

ఆ వెంటనే రఘురామ సుప్రీంకోర్టులో వైద్య పరీక్షలపై పిటిషన్ వేశారు. రఘురామను వైద్య పరీక్షల కోసం సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని, రఘురామ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నందున వైద్యపరీక్షల పర్యవేక్షణకు జ్యుడీషియల్ అధికారిని నియమించాలని అప్పుడు తెలంగాణ హైకోర్టును సుప్రీంకోర్టు అదేశించింది. ఆర్మీ ఆస్పత్రి నివేదిక ప్రకారం.. రఘురామ ఎడమకాలి వేలు ఫ్రాక్చర్ అయిందనీ, ఇతర గాయాలు కూడా ఉన్నట్లు తేలింది. రఘురామ బెయిల్ పిటిషన్ పై తీవ్ర వాదోపవాదనలు జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఆయనకు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచీ రఘురామ ఏపీ సీఎం జగన్ లక్ష్యంగా ఆరోపణలు చేస్తూనే ఉండడం విశేషం.

రఘురామను సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడం, భౌతికంగా కొట్టడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించడం విశేషం. రఘురామ అరెస్ట్ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును హెచ్చార్సీ తప్పుపట్టింది. అప్పటి ఏపీ డీజీపీ గౌతం సవాంగ్, హోం మంత్రిత్వశాఖ చీఫ్ సెక్రటరీకి నోటీసులు కూడా ఇచ్చింది.

ఇప్పుడు తాజాగా  ఎమ్మెల్యేలకు ఎర  కేసు దర్యాప్తులో భాగంగా రఘురామకు సంబంధించిన పలు కీలక విషయాలను సిట్ సేకరించిందని సమాచారం. ఈ క్రమంలోనే రఘురామను విచారణకు రావాలని తెలంగాణ సిట్ 41ఏ నోటీసు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అప్పుడు ఏపీ సీఐడీ యాక్షన్ వెనుక సీఎం జగన్ హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు కూడా రఘురామకు తెలంగాణ సిట్ నోటీసులు ఇవ్వడం వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అక్కడ సీఎం, ఇక్కడ సీఎం ఇద్దరూ ఒకే తానులో ముక్కల్లాంటి వారే అని.. రఘురామను ఇరుకున పెట్టేందుకు ఇద్దరి సంయుక్త వ్యూహం ఏమైనా ఉందా? అనే సంశయాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి.