తెలంగాణలో భారీ ఎన్ కౌంటర్...

 

తెలంగాణలో ఓ భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్లో ఎనిమిది మంది నక్సల్స్ హతమైనట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం... తెలంగాణలోని కొత్తగూడెం - భద్రాద్రి జిల్లా.., టేకులపల్లి మండలం బోడు, కొమరారం పరిధిలోని అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ప్రాంతంలో నక్సల్స్ సంచారం చేస్తున్నారన్న సమాచారాన్ని అందుకున్న గ్రేహౌండ్స్ పోలీసు దళాలు కూంబింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో వారికి నక్సల్స్ తారసపడగా... వారిని లొంగిపోవాలని హెచ్చరించినా వినకుండా నక్సల్స్ కాల్పులు ప్రారంభించారు. దీంతో కూంబింగ్ దళాలు కూడా ఎదురు కాల్పులు ప్రారంభించాయి. ఈ ఎన్ కౌంటర్ లో పీపుల్స్ వార్ నుండి విడిపోయిన చంద్ర పుల్లారెడ్డి బాటకు చెందిన అజ్ఞాత దళ సభ్యులు ఎనిమిది మంది మృతి చెందారు. ఘటనా స్థలి నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు స్వాధీనం చేసుకున్నామని, వీరు ఎవరన్న విషయాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.