తెలంగాణ ఉద్యమం: పాతపాటే కెసిఆర్ నోట
posted on Dec 30, 2011 8:37AM
మహబూ
బ్ నగర్: తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరుకుందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మళ్లీ పాత పాటే పాడారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన పోరు యాత్రకు హాజరయిన కెసిఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యమం కీలక దశకు చేరుకుందని సంక్రాంతి తర్వాత మలి విడత ఉద్యమం ప్రారంభమవుతుందన్నారు. జనవరి 17వ తేదిన ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రాజకీయ సందర్భం వచ్చినప్పుడల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉద్యమం ఏరూపంలో ఉన్నా ప్రజల సహకారం అవసరమన్నారు. వెన్నెముకలేని రాజకీయ నాయకులే తెలంగాణకు శాపంగా మారారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విద్యార్థులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. ముందు ముందు ఉద్యమం భయంకరంగా ఉంటుందన్నారు. కేంద్రం ప్రజాస్వామిక ఆకాంక్షను గౌరవించడం లేదన్నారు. తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వం కావాలన్నారు. తెలంగాణ ఇప్పుడు సాధించుకోకుంటే కట్టుబానిసలుగా మారాల్సి వస్తుందన్నారు. పదకొండేళ్లుగా సహనంతో ఉద్యమిస్తున్నామని, రాష్ట్ర సాధనే అంతిమ లక్ష్యమన్నారు.