ఏపీలో మహిళోద్యమం.. ఆడపడుచుల ఆత్మగౌరవ సభలతో పోరాటం..
posted on Nov 27, 2021 10:25AM
జగనన్న పాలనతో మహిళలకు అసలేమాత్రం విలువ లేకుండా పోయింది. భద్రత కూడా కరువైంది. ఓవైపు యువతులపై అఘాయిత్యాలు, హత్యలు. మరోవైపు వైసీపీ నేతల బూతు మాటలు..చేష్టలు..లీక్ అవుతున్న కాల్ రికార్డింగ్లు. ఇవి చాలవన్నట్టు.. నిండు అసెంబ్లీలో చంద్రబాబు సతీమణిని ఉద్దేశించి వైసీపీ సభ్యులు చేసిన సంస్కారహీన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు అంతటి నేతను వెక్కి వెక్కి ఏడ్చేలా చేయడంపై అంతా మండిపడుతున్నారు. ఇప్పటికే వైసీపీకి నందమూరి ఫ్యామిలీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. రాష్ట్రంలోని మహిళలంతా అధికారపార్టీ నేతల తీరును కడిగిపారేస్తున్నారు. మరోవైపు, ప్రతిపక్ష టీడీపీ సైతం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సిద్ధమవుతోంది.
ఆడపడుచుల ఆత్మగౌరవం కోసం డిసెంబరు ఒకటి నుంచి ఏపీ వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో గౌరవ సభలు నిర్వహించాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. ప్రజాస్వామ్య సౌధమైన శాసనసభను కౌరవ సభగా మార్చి మహిళల వ్యక్తిత్వంపై ఏ విధంగా దాడి చేశారో ప్రజాచైతన్యం కల్పించాలని భావిస్తోంది. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెడ్డకూడదని.. జగన్ అండ్ బ్యాచ్ ఆగడాలను ప్రజాక్షేత్రంలో తీవ్రంగా ఎండగట్టాలని టీడీపీ డిసైడ్ అయింది. ఆడపడుచుల ఆత్మగౌరవం పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతోంది.
టీడీపీ పొలిట్ బ్యూరో భేటీలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలు....
--వరద మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష పరిహారంగా ఇవ్వాలి. పంట నష్టం వెంటనే అందజేయాలి. ఇళ్లు కోల్పోయిన వారికి తక్షణ సాయం కింద రూ.లక్షల అందించి, శాశ్వత గృహాన్ని ఉచితంగా నిర్మించి ఇవ్వాలి.
--మోటారు వాహనాల చట్టం ద్వారా పన్నులు పెంచడం వల్ల లక్షలాది మందిపై భారం పడుతుంది. ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి.
--పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజలపై విపరీతమైన భారం పడుతోంది. నిత్యావసరాల ధరలు పెరిగాయి. పెట్రోల్పై రూ.16, డీజిల్పై రూ.17 తగ్గించాలని పొలిట్ బ్యూరో డిమాండ్ చేసింది. వరి వేయరాదన్న మంత్రుల ప్రకటనను ఖండించింది.
--శాసనమండలి రద్దు, పునరుద్దరణపై వైసీపీ విధానం.. వ్యవస్థ పట్ల ఎంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందో స్పష్టం చేస్తోంది.
--వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు నిందితులను రక్షించే విధంగా ముఖ్యమంత్రి చర్యలు ఉన్నాయి.
--పంచాయతీల నిధులు దారి మళ్లింపు 73వ రాజ్యాంగ సవరణను ధిక్కరించడమేనని, వెంటనే పంచాయతీలకు నిధులు జమ చేయాలని డిమాండ్ చేసింది.
--రాష్ట్ర ఆర్థిక నిర్వహణపై కాగ్ సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి.