తెలుగువారి ఆత్మగౌరవ పతాక తెలుగుదేశం!

తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి శుక్రవారం నాటికి (మార్చి 29) సరిగ్గా 42 ఏళ్లు.  ఈ 42 ఏళ్లుగా ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా.. తెలుగువాడి, వేడికి అండగా, దండగా, దక్షతగా నిలిచిన పార్టీ తెలుగుదేశం. తెలుగు దేశం పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి  సాక్షీభూతం.  దేశాన్ని ఏకపక్షంగా పాలిస్తూ రాష్ట్రాల హక్కులు కాలరాస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించిన తెలుగుదేశం, ఆవిర్భావంతోనే సంచలనం సృష్టించింది.  తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని గర్జించి  పార్టీని స్థాపించిన నందమూరి తారకరామారావు, పార్టీని స్థాపించిన  తొమ్మిది నెలలలోనే అధికారంలోకి తీసుకువచ్చారు.  పార్టీ ఆవిర్భవించిన తొమ్మిది నెలల స్వల్ప వ్యవధిలో అధికారాన్ని చేజిక్కించుకున్న తెలుగుదేశం పార్టీ అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ప్రతిసారి ముఖ్యమంత్రులను మార్చే కాంగ్రెస్ తీరును ఎండగడుతూ ఎన్టీఆర్ చేపపట్టిన చైతన్యరథ యాత్ర నభూతో నభవిష్యతి. 1982 మార్చి 29న పార్టీని  ప్రకటించారు తారకరామారావు. 
ఎన్టీఆర్  చైతన్యరధం బయలుదేరగానే.. తెలుగు దేశం పార్టీకి బ్రహ్మరథం మొదలైంది. పల్లెలన్నీ ఆయన వెంట కదిలాయి. ఎన్టీఆర్ ఎక్కడికెళ్లినా జన నీరాజనమే. ఇసుక వేస్తే రాలనంత జనమే.  గ్రామాలు గ్రామాలే ఆయనకు జై కొట్టాయి. ముందు లీడర్లెవరు ఆయనకు మద్దతుగా నిలవలేదు. రాజమండ్రిలో గోరంట్ల రాజేంద్రప్రసాద్ తమ్ముడు పార్టీ జెండా కట్టారు. కడియంలో  వడ్డి వీరభద్రరావు  సభ్యత్వ పుస్తకాలు పట్టుకుని  రాజ్ దూత్ బండి మీద తిరిగారు.  బూరుగుపూడి పెందుర్తి సాంబశివరావు పార్టీ జెండా ఎత్తారు. ఇలా ఒక్కొక్కరు అన్నగారికి తోడయ్యారు. మండు వేసవిలో అన్నగారి పర్యటన సాగుతున్నా.. జన జాతర ఆగలేదు. ఆయన ప్రత్యర్ధులు మాత్రం సినిమా ఆకర్షణగానే భావించారు .. అలాగే వ్యాఖ్యానించేవారు. వేషాలు వేసుకునేవాళ్లకు ఓట్లు పడతాయా అంటూ అవహేళన చేశారు. ఎన్టీఆర్ పర్యటనకు ఆటంకాలు కల్పించారు. వసతి దొరక్కుండా చూసేవారు.  అయినా అన్నగారి జోరు తగ్గలేదు. అప్పడు ఏ బండికి చూసినా తెలుగుదేశం పిలుస్తుంది రా  కదలిరా  స్టిక్కర్లే.  వేలాది మంది కార్యకర్యలే సొంత డబ్బులతో జెండాలు కొని మోసారు.

చైతన్య రథంపై నుంచి ఖాకీ డ్రెస్ లో ఎన్టీఆర్ మాటల తూటాలు..ఉర్రూతలూగించే ప్రసంగాలకు జనాలు ఫిదా అయ్యారు. చైతన్యరధయాత్ర సాగుతుండగానే ఎన్నికలు వచ్చేశాయి. కొంత మందిని ఎన్టీఆర్ పిలిచి టిక్కెట్లు ఇస్తానంటే.. వద్దని కాంగ్రెస్ తరుపున నిలిచారు. అలాంటి వారిలో నీరుకొండ నారయ్య చౌదరి..రాయవరం మునసబు ఉండవల్లి సత్యనారాయణమూర్తి లాంటి నేతలు ఉన్నారు. ఎన్నికలు ముగిశాయి. అయినా కాంగ్రెస్ నేతలకు దింపుడు కళ్ళం ఆశ చావలేదు. సినీ గ్లామరుకి ఓట్లు పడవని వారికి నమ్మకం. అమ్మ బొమ్మకే ఓటేస్తారని వాళ్ల విశ్వాసం. 

కౌంటింగ్ మొదలైంది. సాయంత్రం మొదటి ఫలితం షాద్ నగర్... కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ శ్రేణుల ఉత్సాహంగా ఉన్నారు. రేడియో వార్తల్లో ఫలితాల సరళి వెల్లడవుతున్నది. ఒక్కో జిల్లా వారీగా వరుసగా ఆధిక్యతలు చెబుతూ వస్తున్నారు. జిల్లాలకు జిల్లాలు తుడుచిపెట్టుకుపోయాయి. ఎన్టీవోడి దెబ్బకు వేళ్ళూనుకున్న కాంగ్రెస్ మహావృక్షాలు కూలిపోయాయి. ఒక్కో నియోజక వర్గం ఆధిక్యతలు చెబుతుంటే జనం స్పందన జేజేలు..ప్రత్యర్ధుల హాహాకారాలు..ఆర్తనాదాలు. ఎన్టీఆర్ ప్రభంజనాన్ని ...ఈ రీతి విజయాన్ని వారు ఊహించలేదు. దాదాపు అర్ధరాత్రికే మూడింట రెండొంతులు పైగా స్దానాలు కైవసం చేసుకుంది తెలుగు దేశం పార్టీ. డాక్టర్లు..ఇంజినీర్లు.. లాయర్లు..పట్టభద్రులు.. బడుగుబలహీన వర్గాలకు చెందిన కొత్తరక్తం రాజకీయాల్లో అరంగేట్రం చేసారు. ఆంధ్రప్రదేశ్ ఫలితం అప్పుడు దేశ వ్యాప్తంగా పెను సంచలనం. లెక్కింపు మొత్తం పూర్తయ్యేసరికి తెలుగు దేశ పార్టీ 202 స్థానాలు గెలుచుకుని ఘన విజయం సాధించింది. 

 వేషాలు వేసుకునేవాడంటూ హేళన చేసిన ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఏపీ ఫలితాలు చూసి షాకయ్యారు. 1983 జనవరి 9న ఆంధ్రప్రదేశ్ లో తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నందమూరి తారకరామారావు.  దీంతో తెలుగురాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తో నవశకం ప్రారంభమయింది. బడుగుబలహీన వర్గాల వేదికయింది. తెలుగు వాడి ఆత్మగౌరవానికి..ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయింది.  

1983లో దేశం మొత్తం మీద 544 లోక్‌సభ స్థానాలకుగాను 400 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెసు హవా కొనసాగుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించింది. అప్పటి లోక్‌సభలో  ప్రధాన ప్రతిపక్షమయింది. 

అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాకర్షక పథకాలతో జనాల గుండెల్లో చోటు సంపాదించారు నందమూరి తారక రామారావు. ఆయన ప్రవేశపెట్టిన కిలోబియ్యం రెండు రూపాయల పధకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఆయనను పేదవాడి అన్నంముద్దగా మార్చింది. ఇప్పటికీ ప్రజలు రెండు రూపాయల కిలోబియ్యం పథకం గురించి మాట్లాడుకుంటూ అన్నగారిని స్మరించుకుంటున్నారంటే.. ఆ పథకం ఎంతగా పాపులర్ అయిందో ఊహించవచ్చు. పేదల కోసం కూడు, గుడ్డ, గూడు నినాదంతో పాలన సాగించారు ఎన్టీఆర్. వ్యక్తిత్వరీత్యా ఆవేశపరుడిగా కనిపించినా.. తన సంక్షేమ పాలతో పేద ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలిచిపోయారు అన్న ఎన్టీఆర్.

"మదరాసీ"లుగా మాత్రమే గుర్తింపబడుతున్న తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఉత్తేజపరిచి, ప్రపంచానికి తెలుగువారి ఉనికిని చాటిన ధీశాలి  నందమూరి తారక రామారావు. రాజకీయ సన్యాసిగా కాషాయ వస్త్రధారణ చేసినా, "ఒక్క రూపాయి" మాత్రమే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి భృతిగా స్వీకరించినా, అది కేవలం ఎన్.టి.ఆర్.కు మాత్రమే చెల్లింది. నాదెండ్ల భాస్కరరావు 1983 ఆగస్టులో దొడ్డి దారిన ఎన్టీఆర్ పదవిని ఇందిరాగాంధీ సాయంతో లాక్కున్నారు. ఆరోగ్య కారణాలతో అమెరికా వెళ్లి తిరిగి వచ్చిన ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహంతో తన ఏమ్మెల్యే లతో ఢిల్లీలో నిరసన తెలిపారు.తెలుగువారి పౌరుషాన్ని చూపించారు. ఎన్టీఆర్ పోరాటంతో  చేసేది లేక ఇందిరాగాంధీ తిరిగి ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి గా చేశారు . కానీ ఎన్టీఆర్ 1984 లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లి 200 పైగా అసెంబ్లీ సీట్లు సాధించి తన సత్తా ఏంటో ఇందిరాగాంధీకి మరో సారి చూపారు. చూపించారు. రెండవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

1989లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది.  అయినా కుంగిపోకుండా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు రామారావు.  దేశంలో  కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలని,  జాతీయ పార్టీలను ఒక తాటి పైకి తెచ్చారు.  జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా "నేషనల్ ఫ్రంట్" కూటమిని స్థాపించారు.  కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకుని వి.పి.సింగ్ ని ప్రధానిని చేశారు.  "నేషనల్ ఫ్రంట్"కు చైర్మెన్ గా వ్యవహరించారు ఎన్టీఆర్.  1994లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. రామారావు మూడవ సారి ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.  

అయితే రామారావు భార్యగా వచ్చిన లక్ష్మీపార్వతి..  పాలనా వ్యవహారాలలో రాజ్యాంగేతర శక్తిగా కలుగజేసుకుంటున్నదనే ఆరోపణలతో 1995లో  అప్పటి రెవిన్యూ మంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీని రక్షించుకునే లక్ష్యంతో  తిరుగుబాటు చేశారు. అధికారాన్ని దక్కించుకున్నారు.  అత్యధికమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుకి మద్దతు ప్రకటించడంతో ఎన్.టి.రామారావుఅధికారం కోల్పోవలసి వచ్చింది. 1995వ సంవత్సరంలో ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు  చంద్రబాబు 2004వ సంవత్సరం వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు.  అత్యధిక కాలం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా  చరిత్ర సృష్టించాడు. తన పాలనలో హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చారు చంద్రబాబు. హైదరాబాద్ ను ప్రపంచ పఠంలో పెట్టారు. సైబరాబాద్ నగరాన్నే నిర్మించారు.

స్వర్ధాంధ్రప్రదేశ్ లక్ష్యంగా చంద్రబాబు చేసిన పాలన దేశ రాజకీయాల్లో చర్చగా మారింది. తన తొమ్మిదేండ్ల పాలనలో హైదరాబాద్ రూపురేఖలే మార్చేశారు చంద్రబాబు. 1999లో 29 ఎంపీ స్ఠానాలు గెలిచిన తెలుగు దేశం పార్టీ.. పార్లెమంట్ లో నాలుగో అతిపెద్ద పార్టీగా నిలిచింది. 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు తీసింది. చంద్రబాబు విజన్... అన్ని రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచింది. చంద్రబాబు దార్శనికత, ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి అయువుపట్టుగా మారాయి. చంద్రబాబు విజన్ వల్లే తెలంగాణ ప్రస్తుతం ధనిక రాష్ట్రంగా నిలిచిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన ఎన్నికలలో  తెలుగుదేశం విజయం సాధించింది. విభజిత ఆంధ్రప్రదేశ్  తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన విజన్ తో  రాజధాని సైతం లేకుండా, రెవెన్యూలోటుతో మిగిలిన రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారు. ప్రపంచదేశాలే నివ్వెరపడే విధంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి అంకురార్పణ చేశారు. గతంలొ ఎన్నడూలేని విధంగా రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూమి ఇచ్చారు. భూసమీకరణ ద్వారా పైసా ఖర్చు లేకుండా రైతులు తమ భూములను ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ప్రధాని మోడీ అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఢిల్లీ అసూయపడేలా అమరావతి నిర్మాణం సాగాలని ఆశీర్వదించారు. కియా మోటార్స్ వంటి కంపెనీలు రాష్ట్రానికి క్యూ కట్టాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం వరుసగా మూడు సంవత్సరాలు దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.  
2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని సమూలంగా తుడిచిపెట్టేయడమే లక్ష్యంగా జగన్ ఈ ఐదేళ్లలో చేయని ప్రయత్నం లేదు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపై వేధింపులే లక్ష్యంగా ఆయన పాలన సాగింది. స్కిల్ కేసు అంటూ చంద్రబాబును సైతం అక్రమంగా అరెస్టు చేశారు.  అయితే తెలుగుదేశం పార్టీ అన్ని అడ్డంకులనూ అధిగమించి చెక్కు చెదరకుండా నిలిచింది.    ఎన్టీఆర్‌ ఆశయాలు, ఆలోచనలు, విధానాలకు అనుగుణంగానే పనిచేస్తోంది.  ఇనుమడించిన ఉత్సాహంతో రానున్నఎన్నికలలో విజయం సాధించి అధికారపగ్గాలు అందుకోవడానికి ఉరకలేస్తోంది. ప్రజల అభిమానమే ఆయుధంగా అడుగులు వేస్తోంది. తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్ఱావ దినోత్సవం సందర్భంగా   తెలుగుదేశం పార్టీ నేతలు తమ పార్టీ సుదీర్గ ప్రస్థానాన్ని, చేసిన పోరాటాలను మననం చేసుకుంటూ,  స్ఫూర్తితో  రాబోయే ఎన్నికలలో విజయం సాధించి మరోసారి తమ సత్తా చాటేందుకు సిద్ధం అవుతోంది.    

తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా...