రాహుల్ అనర్హతపై స్పీకర్ పునరాలోచన?

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగతున్న నేపధ్యంలో వెలుగులోకి వచ్చిన, లక్షద్వీప్‌ ఎన్సీపీ ఎంపీ మహ్మద్‌ ఫైజల్‌  అనర్హత వేటు  వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్‌సీపీ నేత మహమ్మద్‌ ఫైజల్‌ పై గతంలో వేసిన అనర్హత వేటును లోక్‌సభ సచివాలయం ఎత్తివేసింది. ఆయనపై  అనర్హతను ఉపసంహరించుకుంటున్నట్లు, ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు లోక్‌సభ సెకట్రేరియట్  బుధవారం(మార్చి 29) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఫైజల్‌ అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టు లో విచారణ జరుగుతుండగానే.. ఈ నోటిఫికేషన్‌ రావడం గమనార్హం. 

ఫైజల్‌ లోక్‌సభ సభ్యత్వం విషయంలో.. లోక్‌సభ సెక్రటేరియెట్‌ వెనక్కి తగ్గింది. సుప్రీం కోర్టులో  బుధవారం(మార్చి 29) వాదనలు జరగడానికి కొన్ని గంటల ముందే బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఫైజల్‌పై అనర్హత వేటు ఎత్తేస్తున్నట్లు లక్షద్వీప్‌ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు లోక్‌సభ సెక్రటేరియెట్‌ జనరల్‌  ఓ నోటిఫికేషన్‌ను రిలీజ్‌ చేసింది.  2016, జనవరి 5వ తేదీన ఫైజల్‌పై అండ్రోథ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఓ హత్యాయత్నం కేసు నమోదైంది. ఆ కేసు కొనసాగుతుండగానే.. 2019లో ఆయన లోక్‌సభ ఎంపీగా నెగ్గారు. అయితే.. ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఫైజల్‌తో పాటు మరో ముగ్గురికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది కోర్టు. దీంతో జనవరి 13వ తేదీన లోక్‌సభ సచివాలయం ఫైజల్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ.. అనర్హత వేటు వేసింది. దీంతో ఆయన కోర్టుకు ఆశ్రయించగా.. నిర్దోషిగా తేలుస్తూ... కేరళ కోర్టు  సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని ఆదేశించింది. కానీ, లోక్‌సభ సెక్రటేరియట్‌ అనర్హత వేటు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో బుధవారం ( మార్చి 29) ఫైజల్‌ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరగనున్న నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటును ఎత్తివేసింది లోక్ సభ. ఇదిలా ఉంటే.. తాజాగా రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు పడడంతో.. ఫైజల్‌ కేసులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో, అవి రాహుల్‌ కేసులోనూ వర్తించే అవకాశాలున్నాయన్న చర్చ నడుస్తోంది.

కాగా..  కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వ అనర్హతపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్‌ గాంధీ కేసులో ఇది ప్రభావం చూపించనుందని భావిస్తున్నారు. అయితే, రాహుల్ గాంధీ అనర్హత విషయంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వినిపించడంతో పాటుగా, ఈ విషయంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో విపక్షాలు ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపధ్యంలో లోక్ సభ సెక్రటేరియట్ పునరాలోచనలో పడిందని అంటున్నారు.

రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని విపక్షాలన్నీ తప్పుపడున్న విష్యం తెలిసిందే. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన విపక్షాల సమావేశంలో రాహుల్ విషయంలో స్వీకర్ తొందరపడ్డారనే అభిప్రాయం  వ్యక్తమైందని చెబుతున్నారు.  2019 పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధించింది. ఆ వెంటనే పార్లమెంట్ సెక్రటేరియట్ ఆయనపై అనర్హత వేటు వేసింది.

దీంతో ఓం బిర్లాపై విపక్షాలన్నీ అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఉన్నట్లు వార్త లొచ్చాయి. ఖర్గే నివాసంలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశానికి కొనసాగింపుగా   మంగళ వారం (మార్చి 28) జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎంపీల సమావేశంలో స్పీకర్ పై  అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన చేశారు. ఇదే అంశంపై ఇతర పార్టీల నేతలతో కాంగ్రెస్  చర్చించి ఏప్రిల్ 3న అవిశ్వాస తీర్మానాన్ని  ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో లక్షదీప్ ఎన్సీపీ ఎంపీ మహమ్మద్‌ ఫైజల్‌ పై గతంలో వేసిన అనర్హత వేటును లోక్‌సభ సచివాలయం ఎత్తివేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.